అరకు లోయలో కార్మిక సంఘాల సమ్మె విజయవంతం
అల్లూరి జిల్లా, అరకు లోయ | త్రినేత్రం న్యూస్, జూలై 10: కేంద్ర ప్రభుత్వం అమలు చేయబోతున్న నాలుగు లేబర్ కోడ్స్ను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం అరకు మండల కేంద్రంలో కార్మిక సంఘాల సమ్మె జోరుగా సాగింది. సమ్మె ప్రభావంతో పద్మపురం గార్డెన్, గిరిజన మ్యూజియం, కాఫీ హౌస్ వంటి పర్యాటక కేంద్రాలు మూతపడ్డాయి. అలాగే, పెట్రోలు బంకుల కార్మికులు విధులను బహిష్కరించారు.
సమ్మెకు నేతత్వం వహించిన సీఐటీయూ మండల కార్యదర్శి జాన్ని భగత్ రామ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో, జిల్లా ప్రధాన కార్యదర్శి వి. ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ – ‘‘లేబర్ కోడ్స్ కార్మిక హక్కులను హరించేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్ర,’’ అని మండిపడ్డారు. కనీస వేతనం రూ.26,000గా నిర్ధారించాలని, పాత కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
ప్రస్తుతం కేంద్రం ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తూ, ప్రభుత్వ రంగ సంస్థలను తక్కువ ధరకే కార్పొరేట్లకు అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. ఇది ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాల రిజర్వేషన్లను కూడా ప్రభావితం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో పార్లమెంట్ సాక్షిగా ఈ కోడ్స్ను అమలు చేయడం కార్మికులపై దాడిగా అభివర్ణించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పదిగంటల పని వేళల నిర్ణయం కూడా శ్రామికులను బానిసలుగా మారుస్తుందని ఆరోపించారు. నిత్యావసర ధరలు పెరుగుతున్నా, వేతనాలు పెరగకపోవడం బాధాకరమన్నారు.
ఈ సమ్మెకు ఎస్బీఐ ఎంప్లాయిస్ యూనియన్ అరుణ్, కాఫీ రైతు సంఘం జాతీయ సహాయ కార్యదర్శి చినబాబు, సీపీఎం మండల కార్యదర్శి కె. రామారావు, ఆదివాసి సంఘాల నాయకులు పి. బాలదేవ్, బుజ్జిబాబు తదితరులు మద్దతు తెలిపారు. అంగన్వాడీ, ఆసుపత్రి, మిడ్డే మీల్, ఐకెపి, పంచాయతీ, టూరిజం కార్మిక సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


