అంతర్జాతీయ మాదకద్రవ్య వ్యతిరేక దినం సందర్భంగా అరకు వ్యాలీలో విస్తృత అవగాహన ర్యాలీ
అల్లూరిజిల్లా(అరకులోయ టౌన్)జూన్ 27 (త్రినేత్రం న్యూస్): అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినాన్ని పురస్కరించుకొని గురువారం నాడు అల్లూరి జిల్లా అరకు వ్యాలీ టౌన్లో మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. అరకు ఎస్ఐ గోపాలరావు నేతృత్వంలో చేపట్టిన ఈ ర్యాలీలో సుమారుగా వంద మందికి పైగా విద్యార్థులు, యువత, మహిళలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
“గంజాయి జోలికి పోవద్దు – ఖైదీలుగా మారొద్దు”, “గంజాయి మీ జీవితాలను నాశనం చేస్తుంది”, “మాదకద్రవ్యాల వ్యసనం మృత్యుపాశం” అంటూ నినాదాలతో జంక్షన్ మార్గమంతా మార్మోగిపోయింది. ఈ ర్యాలీ చోంపి జంక్షన్ నుండి ప్రారంభమై ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్ వద్ద ముగిసింది. అనంతరం అక్కడ మానవహారం ఏర్పాటు చేసి మాదకద్రవ్యాల వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఎస్ఐ గోపాలరావు మాట్లాడుతూ, “ప్రస్తుతం గంజాయి వంటి మాదకద్రవ్యాలు యువతను వేగంగా మాయాజాలంలోకి లాక్కొంటున్నాయి. ఒకసారి మాదకద్రవ్యాలకు బానిసైతే జీవితమే చీకటిలోకి వెళ్లిపోతుంది. మన భవిష్యత్తును, కుటుంబాన్ని నాశనం చేసుకునే మార్గమే ఇది. అందుకే, ప్రతి ఒక్కరు మత్తు పదార్థాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.” అని హెచ్చరించారు.
అలానే, మాదకద్రవ్యాల సరఫరాకు, వినియోగానికి సంబంధించి సమాచారాన్ని పోలీసులకు ఇవ్వాలని ప్రజలను కోరారు. ప్రత్యేకంగా విద్యార్థులకు, యువతకు ఈ విషయమై స్పష్టమైన అవగాహన కల్పించేందుకు పోలీసులు కృషి చేస్తామని తెలిపారు. అలాగే అరకు వ్యాలీని మాదకద్రవ్యాల రహిత ప్రాంతంగా మార్చాలనే లక్ష్యంతో ఇలాంటి కార్యక్రమాలను తరచుగా నిర్వహించనున్నట్లు ఎస్ఐ తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


