IND vs ENG : ఇంగ్లండ్‌ను ఊడ్చేసిన భారత్

TRINETHRAM NEWS

ఇంగ్లండ్‌ను ఊడ్చేసిన భారత్

Trinethram News : ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. అహ్మదాబాద్ వేదికగా బుధవారం ఏకపక్షంగా సాగిన మూడో వన్డేలో టీమిండియా 142 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో సగర్వంగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 బరిలోకి దిగనుంది.

మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 356 పరుగులకు ఆలౌటైంది. శుభ్‌మన్ గిల్ (102 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్‌లతో 112) శతకంతో చెలరేగగా.. విరాట్ కోహ్లీ(55 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 52), శ్రేయస్ అయ్యర్(64 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 78) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్(4/64) నాలుగు వికెట్లు తీయగా.. మార్క్ వుడ్(2/45) రెండు వికెట్లు పడగొట్టాడు. సకీబ్ మహ్మూద్, గస్ అట్కిన్సన్, జోరూట్ తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఇంగ్లండ్ 34.2 ఓవర్లలో 214 పరుగులకు కుప్పకూలి ఓటమిపాలైంది. టామ్ బాంటన్(41 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38), గస్ అట్కిన్సన్(19 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 38) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు తీయగా.. వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీసారు.

భారీ లక్ష్యచేధనకు దిగిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు మెరుగైన ఆరంభాన్ని అందించారు. ఓపెనర్ల దూకుడైన బ్యాటింగ్‌తో ఇంగ్లండ్ 6 ఓవర్లలోనే 60 పరుగులు చేసింది. కానీ అర్ష్‌దీప్ సింగ్ వరుస ఓవర్లలో బెన్ డకెట్(34), ఫిల్ సాల్ట్(23) పెవిలియన్ చేర్చాడు. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 60 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. టామ్ బాంటన్ సైతం భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. జోరూట్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నిర్మించే ప్రయత్నం చేశాడు. కానీ అతన్ని కుల్దీప్ యాదవ్ ఔట్ చేయగా.. జోరూట్‌ను అక్షర్ పటేల్ క్లీన్ బౌల్డ్ చేశాడు.

హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్‌లను వరుస ఓవర్లలో హర్షిత్ రాణా క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో ఇంగ్లండ్ 161 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. లివింగ్ స్టోన్‌(9)ను సుందర్ పెవిలియన్ చేర్చగా.. ఆదిల్ రషీద్‌, మార్క్ వుడ్(9)లను హార్దిక్ పాండ్యా వరుస ఓవర్లలో పెవిలియన్ చేర్చాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా.. మరోవైపు గస్ అట్కిన్సన్ పోరాడాడు. అతన్ని అక్షర్ పటేల్ క్లీన్ బౌల్డ్ చేసి భారత విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.

ఫిబ్రవరి 19 నుంచి పాకిస్థాన్ వేదికగా హైబ్రిడ్ మోడల్‌లో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా అన్నివిధాల సిద్దమైంది. ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా మేనేజ్‌మెంట్ చక్కగా వాడుకుంది. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫామ్‌లోకి రావడం జట్టుకు కొండంత బలాన్నిచ్చింది. బౌలర్లు చక్కగా ప్రదర్శన చేశారు. వెన్నుగాయంతో జస్‌ప్రీత్ బుమ్రా దూరమైనా.. అతని స్థానంలో ఎంపికైన హర్షిత్ రాణా ఇంగ్లండ్‌తో సిరీస్‌లో మెరుగ్గా రాణించాడు. తన పేస్‌తో ఇంగ్లండ్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

WhatsApp Image 2025 02 12 at 21.24.11
IND vs ENG

You cannot copy content of this page

Scroll to Top