Vijayalakshmi Arrest : రూ.300 కోట్ల మోసానికి పాల్పడిన శ్రీలక్ష్మి కన్‌స్ట్రక్షన్స్ యజమాని విజయలక్ష్మి అరెస్ట్

TRINETHRAM NEWS

రూ.300 కోట్ల మోసానికి పాల్పడిన శ్రీలక్ష్మి కన్‌స్ట్రక్షన్స్ యజమాని విజయలక్ష్మి అరెస్ట్

దేశం విడిచిపారిపోయేందుకు ప్రయత్నం. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్న పోలీసులు. విల్లాల పేరుతో భారీ మోసానికి తెరతీసిన నిందితురాలు

Trinethram News : Hyderabad : రూ. 300 కోట్ల మోసానికి పాల్పడి దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నించిన శ్రీలక్ష్మి కన్‌స్ట్రక్షన్స్ యజమాని గుర్రం విజయలక్ష్మి (48)ని శంషాబాద్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిజాంపేటకు చెందిన విజయలక్ష్మి శ్రీలక్ష్మి కన్‌స్ట్రక్షన్స్, శ్రీలక్ష్మి మాగ్స్ కన్‌స్ట్రక్షన్స్ అండ్ భావన జీఎల్‌సీ క్రిబ్స్ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించింది. 2018లో మల్లంపేటలో 325 విల్లాల నిర్మాణం ప్రారంభించింది. వాటిలో 65 విల్లాలకు మాత్రమే అనుమతులున్నాయి. మిగిలిన వాటికి పంచాయతీ అనుమతులు చూపించి మొత్తం 260 విల్లాలు విక్రయించింది. అయితే, ఈ విల్లాలు అక్రమమని ఫిర్యాదు రావడంతో విచారణ అనంతరం 2021లో 201 విల్లాలను అధికారులు సీజ్ చేశారు. అయినప్పటికీ ఆమె తన పలుకుబడిని ఉపయోగించి మళ్లీ రిజిస్ట్రేషన్ చేయించింది. 26 విల్లాలు ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్ పరిధిలో ఉన్నట్టు గుర్తించిన హైడ్రా సెప్టెంబర్‌లో 15 విల్లాలను కూల్చేసింది.

కాగా, విజయలక్ష్మిపై దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో 7 కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఆమె విదేశాలకు వెళ్లిపోయేందుకు బుధవారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. పాస్‌పోర్టు, వీసా తనిఖీల సమయంలో ఆమెపై లుక్ అవుట్ నోటీసులు ఉన్నట్టు గుర్తించి ఇమిగ్రేషన్ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకుని దుండిగల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారొచ్చి ఆమెను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు పంపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top