
Polavaram Project Displaced : ఏలూరు జిల్లా : త్రినేత్రం న్యూస్: ఆగస్టు 18 ; పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల కాలనీలను డిసెంబర్ లోగా పూర్తిచేసి, నిర్వాసితులందరినీ కాలనీలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుండి పోలవరం ప్రాజెక్ట్ పునరావాసం, కాలనీల నిర్మాణాలకు సంబంధించి భూసేకరణ, కాలనీల నిర్మాణపనులపై అధికారులతో జూమ్ కాన్ఫెరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ ప్రాజెక్ట్ మొదటి దశ నిర్వాసితులకు పునరావాస కార్యక్రమాల పూర్తిపై ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తున్నారని తెలిపారు. ఆదేశాల ననుసరించి ప్రాజెక్ట్ నిర్వాసితుల కాలనీల నిర్మాణ పనులను డిసెంబర్ లోగా పూర్తిచేసి నిర్వాసితులను సదరు కాలనీలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులను ఆదేశించారు.
కాలనీలలో ఇళ్ల నిర్మాణ పనులతో పాటు కాలనీలలో రోడ్లు, డ్రైనేజి, అంగన్వాడీ, పాఠశాలలు, త్రాగునీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలను నిర్వాసితులను కాలనీలకు తరలించే ముందుగానే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. వాటి నిర్మాణానికి, మౌలిక సదుపాయాల ఏర్పాటు నిమిత్తం ఇంకా చేయవలసిన భూసేకరణను వెంటనే పూర్తిచేయాలన్నారు. భూసేకరణ లో అవకతవకలకు పాల్పడినా, కాలనీల నిర్మాణాల విషయంలో అలసత్వం వహించే అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హెచ్చరించారు. నిర్వాసితులకు ఇళ్ల నిర్మాణం, భూమికి భూమి పరిహారం అంశాలలో పెండింగ్ లో ఉన్న భూసేకరణ పనులను వెంటనే పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ జూమ్ మీటింగులో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ, పంచాయతీ రాజ్, రహదారులు, భవనాల శాఖ ఎస్ఈ లు జెడ్. రమేష్, విజయరత్నం, గృహ నిర్మాణ పిడి సత్యనారాయణ, భూసేకరణ విభాగం అధికారులు, తహసీల్దార్లు, పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe