TRINETHRAM NEWS

Trinethram News : న్యూఢిల్లీ/భువనేశ్వర్‌: ఒడిశా కేంద్రంగా మద్యం వ్యాపారం చేస్తున్న సంస్థకు సంబంధించిన ప్రాంతాల్లో ఆదాయ పన్ను(ఐటీ) అధికారులు చేసిన సోదాల్లో దొరికిన నగదు మొత్తం రూ.351 కోట్లకు చేరింది.

దేశంలో ఒక దర్యాప్తు సంస్థ ఒకేసారి చేసిన సోదాల్లో ఇంతటి భారీస్థాయిలో కరెన్సీ బయటపడటం ఇదే తొలిసారి! బౌద్ధ్‌ డిస్టిల్లరీ ప్రైవేట్‌ లిమిటెడ్, దాని ప్రమోటర్లు, ఇతరులకు సంబంధించిన చోట్ల ఐటీ అధికారుల సోదాలు ఐదోరోజైన ఆదివారమూ కొనసాగాయి.

మద్యం వ్యాపారం ద్వారా పొందిన దాంట్లో లెక్కల్లో చూపని ఆదాయం గుట్టుమట్లను ఐటీ శాఖ రట్టుచేస్తోంది. తనిఖీల్లో భాగంగా రాంచీలోని కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు ధీరజ్‌ ప్రసాద్‌ సాహూ సంబంధిత ప్రాంతాల్లోనూ ఐటీ అధికారులు చెక్‌చేశారు. ఇక్కడ ఎంత మొత్తంలో నగదు, ఇతర పత్రాలు లభించాయనేది అధికారులు వెల్లడించలేదు.

దాదాపు వందేళ్లకు పైగా ధీరజ్ సాహు, వారి కుటుంబం ఉమ్మడి వ్యాపారం చేస్తోంది. అందులో సాహూది చిన్న వాటా మాత్రమేనని అని ధీరజ్ సాహు న్యాయ వాదులు చెప్తున్నారు.