TRINETHRAM NEWS

Trinethram News : న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు 2024 (Lok Sabha Polls2024) షెడ్యూల్ విడుదలకు సమయం ఆసన్నమైంది. భారత ఎన్నికల సంఘం (ECI) ఒకటి రెండు రోజుల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల నోటిఫికేషన్ వివరాలు ప్రకటించే అవకాశం ఉందంటూ జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి..

నేడో, రెపో షెడ్యూల్ ప్రకటించవచ్చని పేర్కొంటున్నాయి. ప్రకటన తేదీల్లో మార్పు ఏమైనా ఉన్నా ఈ వారంలో షెడ్యూల్ విడుదల కావడం ఖాయమంటూ రిపోర్టులు పేర్కొంటున్నాయి. కాగా లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌తో పాటు ఆంధ్రప్రదేశ్, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కూడా వెలువడనుంది..

జమ్ముకాశ్మీర్‌లో ఎన్నికల సన్నద్ధతపై ఎన్నికల సంఘం బృందం పరిశీలన అనంతరం నోటిఫికేషన్ వెలువడాల్సి ఉందని, అయితే ఎన్నికల సంఘం బుధవారం జమ్ముకాశ్మీర్‌లో పర్యటించడంతో ఇక నోటిఫికేషన్ వెలువడడమే తరువాయి అని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. కాగా సెప్టెంబర్ 30, 2024లోగా జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించి, రాష్ట్ర హోదాను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలంటూ సుప్రీంకోర్టు గతేడాది కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితులను పరిశీలించేందుకు ఎన్నికల సంఘం బృందం బుధవారం అక్కడ పర్యటించింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. భద్రతా పరిస్థితిని సమీక్షించిన అనంతరం జమ్మూ కాశ్మీర్‌లో లోక్‌సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలా? లేక వేర్వేరుగా నిర్వహించాలా? అనే దానిపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు..