TRINETHRAM NEWS

రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రితో ఫాక్స్కాన్ కు చెందిన హాన్ హాయ్ ప్రెసిషన్ ఇండస్ట్రీస్ ప్రతినిధి శ్రీ వీలీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం నేడు కలిసింది. రాష్ట్ర ఐ.టి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీఎస్ శ్రీమతి శాంతి కుమారి ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ప్రజల ఆకాంక్షలను కాపాడే భాద్యత కొత్తగా ఏర్పడిన తమ ప్రభుత్వంపై ఉంది, అన్ని వర్గాలకు స్నేహపూర్వకంగా ఉండే విధానాన్ని అవలంబిస్తున్నాం. కాబట్టి, పారిశ్రామిక వేత్తలకు కూడా పూర్తి సహాయ, సహకారాలందిస్తామని అన్నారు. పరిశ్రమల అభివృద్ధి, ఏర్పాటుకు కావాల్సిన అనుమతులు సులభంగా అందించడం తోపాటు, మౌలిక సదుపాయాలను కల్పిస్తామని శ్రీ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా దేశంలోనే అగ్రగామిగా ఉంచేందుకు కావాల్సిన అన్ని చర్యలను తీసుకుంటామని తెలియచేసారు.