TRINETHRAM NEWS

వైసీపీలో కొనసాగుతున్న మార్పులు చేర్పులు..

వైసీపీలో మార్పుల పరంపర కొనసాగుతోంది. మరికొందరు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలతో మాట్లాడిన సీఎం జగన్‌… టిక్కెట్‌ కేటాయింపులపై క్లారిటీ ఇచ్చేశారు. అయితే, ఈ చేంజెస్‌లో మంత్రులు, మాజీ మంత్రులకు కూడా స్థానచలనం తప్పడం లేదు.

పార్టీలో ప్రక్షాళనను మరింత వేగవంతం చేసింది వైసీపీ. ఇప్పటికే ఉభయగోదావరి జిల్లాలపై క్లారిటీకి వచ్చేసిన వైసీపీ హైకమాండ్‌.. రాయలసీమ ఇన్‌చార్జ్‌ల మార్పుపై దృష్టిపెట్టింది. సత్యవేడు, గంగాధర నెల్లూరు, పూతలపట్టు ఎమ్మెల్యేలతో చర్చలు జరిపింది. ఇప్పటికే అనంతపురం జిల్లాలో మార్పులపై కసరత్తు పూర్తిచేసిన వైసీపీ అధిష్ఠానం.. 3 రిజర్వుడు స్థానాలతో పాటు మదనపల్లి ఎమ్మెల్యేనూ పిలిచి మాట్లాడింది.

ఉమ్మడి చిత్తూరులో 4 చోట్ల పోటీకి పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. పెద్దిరెడ్డి పుంగనూరులో పోటీ చేస్తారా? లేక ఆయన తమ్ముడి కుమారుడు సుధీర్‌రెడ్డిని అక్కడ బరిలో నిలుపుతారా? అనే చర్చ జరుగుతోందిప్పుడు. పెద్దిరెడ్డి మరో తమ్ముడు ద్వారకనాథ్‌ రెడ్డి మరోసారి తంబళ్లపల్లి నుంచి పోటీచేస్తారని తెలుస్తోంది. అయితే, మిథున్‌ రెడ్డి మాత్రం మరోసారి ఎంపీగానే పోటీచేసేందుకు ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది.

కల్యాణదుర్గం నుంచి మంత్రి ఉషశ్రీ చరణ్‌ స్థానాన్ని.. పెనుగొండకు మార్చింది వైసీపీ అధిష్టానం. అక్కడ ఈసారి వాల్మీకి వర్గానికి అవకాశం ఇవ్వబోతోంది. అయితే, ప్రస్తుతం పెనుకొండ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న శంకర్‌నారాయణకు టిక్కెట్‌ విషయంలో స్పష్టత రాలేదు. ఎమ్మిగనూరు టిక్కెట్‌ను సిట్టింగ్‌ కేశవరెడ్డికి కాకుండా.. ఈసారి బీసీలకు ఇవ్వాలని వైసీపీ హైకమాండ్‌ నిర్ణయించిన వైసీపీ బుట్టా రేణుకను పిలిపించి మాట్లాడింది.అయితే, వైసీపీలో మార్పులు చేర్పులపై మంత్రి అమర్నాథ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్‌ నిర్ణయాన్ని వ్యతిరేకించేవారు పార్టీ నుంచి బయటకు వెళ్లడమే మంచిదన్నారు.

ఈసారి ఎన్నికల్లో పోటీచేయబోనంటూ ఇటీవలె ప్రకటించిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌.. ఇవాళ సీఎం జగన్‌ను కలవడం చర్చనీయాంశమైంది. రోజుకో అప్‌డేట్‌తో దూసుకెళ్తున్న వైసీపీ మార్పులు చేర్పుల ఎపిసోడ్‌ ఎక్కడ ఆగుతుందో చూడాలి.