TRINETHRAM NEWS

శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందిన నారా కుటుంబం

అన్నప్రసాద వితరణకు రూ.44 లక్షల విరాళం

అన్నప్రసాద సముదాయంలో భక్తులకు స్వయంగా అల్పాహారం వడ్డించిన కుటుంబ సభ్యులు

Trinethram News : తిరుమల : నారా దేవాన్ష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నారా కుటుంబం కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, భువనేశ్వరి దంపతులు, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, సతీమణి నారా బ్రాహ్మణి, కుమారుడు నారా దేవాన్ష్ శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుని, స్వామివారి ఆశీస్సులు పొందారు. నారా దేవాన్ష్ పుట్టినరోజును పురస్కరించుకుని కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా వేద పండితులు ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు. ముందుగా ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్, ఇతర కుటుంబ సభ్యులకు మహాద్వారం వద్ద ఆలయ అర్చకులు, టీటీడీ అధికారులు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. దర్శనం అనంతరం తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్, నారా బ్రాహ్మణి, నారా దేవాన్ష్ భక్తులకు స్వయంగా అల్పాహారం వడ్డించారు.

ఒక్కరోజు అన్నప్రసాద వితరణకు అయ్యే ఖర్చు రూ.44 లక్షలను చంద్రబాబునాయుడి కుటుంబం శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ కు విరాళం ఇచ్చారు. ఏటా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా నారా కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకుని అన్నదానం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఆలయ ఈవో జె.శ్యామలరావు, అదనపు ఈవో సీహెచ్. వెంకయ్య చౌదరి, పలువురు టీటీడీ బోర్డు సభ్యులతో పాటు టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Nara Devansh's birthday celebrations