TRINETHRAM NEWS

మేడారం జాతరలోనే మంత్రి సీతక్క మకాం

Trinethram News : ములుగు జిల్లా:జనవరి 27
మేడారం మహాజాతరకు కేవలం 25 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. జాతరకు నెల రోజుల ముందు నుండే భక్తులు బారులు తీరుతున్నారు.

ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జాతర ఏర్పాట్లలో మరింత స్పీడు పెంచింది. ఈ నెల 31వ తేదీ లోపు అభివృద్ది పనులన్నీ పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లకు డెడ్ లైన్ విధించారు.

ఫిబ్రవరి 21 నుండి 24వ తేదీవరకు మేడారం మహాజాతర నిర్వహిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి జరుగుతున్న ఈ జాతరను రాష్ట్ర ప్రభుత్వం కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి ఏర్పాట్లు చేస్తోంది.

ఈసారి జాతరకు ఆరు రాష్ట్రాల నుండి కోటి 50 లక్షల మంది భక్తులు తరలివస్తారని అంచనాలు వేస్తున్నారు.. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌర్యాలు కలుగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

వరంగల్ జిల్లా కు చెందిన ఇద్దరు మహిళా మంత్రులు సీతక్క – కొండా సురేఖ జాతర నిర్వహణ బాధ్యతలు వారి భుజాల పై వేసుకున్నారు.

ఇదే ములుగు నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి సీతక్క మేడారంలోనే తిష్ట వేశారు.. అన్నీ తానై జాతర అభివృద్ది పనులను చక్కదిద్దుతున్నారు.

గత జాతర అనుభవాలను దృష్టిలో పెట్టుకొని అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తు తను కూడా తల్లుల సేవలో తరిస్తున్నారు..