TRINETHRAM NEWS

● ఏప్రిల్‌ 26 వరకూ వివాహాల కోలాహలం

● 3 నెలల్లో 30 ముహూర్తాలు

● ఆ తర్వాత మూఢం, శూన్య మాసం

● తిరిగి శ్రావణంలోనే ముహూర్తాలు

● అన్నవరంలో వివాహ బృందాల

ముందస్తు రిజర్వేషన్లు

అన్నవరం: చాన్నాళ్ల తరువాత సత్యదేవుని సన్నిధి మళ్లీ నవ దంపతులతో కళకళలాడనుంది. ఈ నెల 11వ తేదీ నుంచి మాఘ మాసం ప్రారంభమవుతుండటంతో.. రాష్ట్రవ్యాప్తంగా పలు జంటలు స్వామి సన్నిధిలో.. వేద మంత్రాలు సాక్షిగా.. జీవితాన్ని పండించుకునేందుకు కొంగులు ముడి వేసుకోనున్నాయి. రత్నగిరిపై వివాహాలు చేసుకునేందుకు ఇప్పటికే పలువురు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నెల 13వ తేదీ ముహూర్తంతో ఇక్కడ వివాహాల కోలాహలం ఆరంభం కానుంది. దీంతో ఇటు సత్రం గదులు, కల్యాణ మండపాలతో పాటు పురోహితులు, కేటరింగ్‌, సన్నాయి మేళం వారికి గిరాకీ పెరిగింది. సుమారు రెండు నెలల విరామం అనంతరం వివాహాలు మొదలవుతూండటంతో సత్రం గదులు, వివాహ మండపాలను అద్దెకిచ్చే సెంట్రల్‌ రిజర్వేషన్‌ కార్యాలయం (సీఆర్‌ఓ) వద్ద, ఉచిత కల్యాణ మండపాల వద్ద పెళ్లిబృందాల సందడి మొదలైంది. పలువురు కల్యాణ మండపాలు, సత్రం గదులను ముందస్తుగా రిజర్వేషన్‌ చేసుకుంటున్నారు.