TRINETHRAM NEWS

రూ.500కు సిలిండర్‌ హామీపై కసరత్తు
లబ్ధిదారుల ఎంపికకు రెండు ప్రతిపాదనలు
కనీసం రూ.2,225 కోట్లు.. గరిష్ఠంగా రూ.4,450 కోట్ల భారం
ప్రాథమికంగా అంచనాకొచ్చిన పౌరసరఫరాలశాఖ

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలలో భాగమైన మహాలక్ష్మి పథకం కింద రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ హామీ అమలుకు సంబంధించిన కసరత్తు మొదలైంది. వంద రోజుల్లోనే అమలు చేస్తామని ప్రభుత్వం స్పష్టంచేసిన నేపథ్యంలో పౌరసరఫరాలశాఖ లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి రెండు రకాల ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ఇందులో మొదటిది రేషన్‌ కార్డు(ఆహార భద్రత కార్డు) ఉన్నవారితోపాటు రేషన్‌కార్డు లేనివారిలోనూ అర్హులను ఎంపిక చేయడం. రేషన్‌కార్డులతో నిమిత్తం లేకుండా అర్హులను ఎంపిక చేయడం రెండోది.
1.20 కోట్ల గ్యాస్‌ కనెక్షన్లు
రాష్ట్రంలో మొత్తం 1.20 కోట్ల గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో హెచ్‌పీసీఎల్‌ నుంచి 43,39,354, ఐఓసీఎల్‌ నుంచి 47,96,302, బీపీసీఎల్‌ నుంచి 29,04,338 ఉన్నాయి. మొత్తం వినియోగదారుల్లో 44 శాతం మంది ప్రతి నెలా రీఫిల్‌ చేసుకుంటున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అంటే సుమారు 52.80 లక్షల మంది నెలకు ఒక సిలిండర్‌ వినియోగిస్తున్నారు. రేషన్‌కార్డు ఉన్న కుటుంబాలు 89.99 లక్షలు. తొలి ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకుంటే పథకాన్ని త్వరగానే అమలుచేయవచ్చని, అయితే అనర్హులూ లబ్ధిదారులయ్యే అవకాశం ఉంటుందని, మొత్తంగా సుమారు కోటి కనెక్షన్లకు రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ ఇవ్వాల్సి రావొచ్చని పౌరసరఫరాలశాఖ ప్రాథమికంగా అంచనాకు వచ్చింది. రెండో ప్రతిపాదనను లెక్కలోకి తీసుకుంటే సర్వే, లబ్ధిదారులను గుర్తించేందుకు ఎక్కువ సమయం పడుతుందని తేల్చింది. ఇటీవల జరిగిన సమీక్ష సమావేశంలో ఆ శాఖ అధికారులు ఆయా ప్రతిపాదనలను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి అందించారు. గురువారం అధికారికంగా నివేదిక అందజేశారు.

ఉజ్వల్‌వి 11.58 లక్షలు.. రాయితీ వదులుకున్న వారు 4.2 లక్షల మంది
ప్రస్తుతం గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.955. సాధారణ కనెక్షన్లపై ఒక్కోదాని బుకింగ్‌కు కేంద్రం రూ.40 రాయితీ ఇస్తోంది. అదే ఉజ్వల్‌ కనెక్షన్లకైతే రాయితీగా రూ.340 అందిస్తోంది. రాష్ట్రంలో ఉజ్వల్‌వి 11.58 లక్షలు ఉన్నాయి. ‘గివ్‌ ఇట్‌ అప్‌’లో భాగంగా రాష్ట్రంలోని 4.2 లక్షల మంది రాయితీని వదులుకున్నారు. మిగిలిన వినియోగదారుల్లో ఈ పథకానికి ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై అదనపు భారం ఆధారపడి ఉంటుంది. మొత్తంగా పథకానికి ఎంపికయ్యే లబ్ధిదారులకు ఏడాదికి ఆరు సిలిండర్లను ఒక్కోటి రూ.500కు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వంపై పడే భారం సుమారు రూ.2,225 కోట్లని, ఏడాదికి 12 సిలిండర్లు ఇచ్చేపక్షంలో అదనపు భారం రూ.4,450 కోట్లని పౌరసరఫరాల శాఖ ఉ్నతాధికారులు అధికారులు లెక్కలు తేల్చారు.