TRINETHRAM NEWS

హైదరాబాద్: భారాస అధినేత కేసీఆర్ అహంభావం, అవినీతి కారణంగానే తెలంగాణ ప్రజలు వారికి బుద్ధి చెప్పారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు..

మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోతే కొంపలు మునిగిపోయినట్లు రాద్ధాంతం చేస్తున్నారని ఆయన అనడం వివేకవంతుడి లక్షణం కాదన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి ఈ విధంగా మాట్లాడటం పద్ధతి కాదని చెప్పారు.

”కేసీఆర్ ఎందుకు ఎమ్మెల్యేగా పోటీ చేశారు? అసలు అసెంబ్లీకి ఎందుకు వెళ్లడం లేదు? కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సీబీఐ విచారణ కోరాలని తెలంగాణ భాజపా తెలివిగా వ్యవహరిస్తోంది. కేసు అప్పగిస్తే మేనేజ్‌ చేయాలనుకుంటున్నారు. కేసీఆర్‌ను ఆ పార్టీ కాపాడే ప్రయత్నం చేస్తోంది. వేల కోట్ల రూపాయల అవినీతికి ఆయన బాధ్యుడు. జరిగిన అవినీతిపై విచారణ చేయించాలి. భారాస నేతలు ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థం కావడం లేదు. కొత్త ప్రభుత్వం ఏర్పాటై రెండు నెలలు గడవకముందే విమర్శలు చేయడం ఆ పార్టీ పతనానికి నాంది” అని వ్యాఖ్యానించారు.