TRINETHRAM NEWS

Chandrababu: పీలేరు సభలో జగన్‌పై నిప్పులు చెరిగిన చంద్రబాబు

Trinethram News : తిరుపతి : ”రా.. కదలిరా” పేరుతో నిర్వహిస్తున్న బహిరంగ సభల్లో సీఎం జగన్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) తీవ్రంగా విరుచుకుపడుతున్నారు..

వైసీపీ పాలనలో ప్రజలు అల్లాడిపోతున్నారంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా పీలేరులో ”రా..కదలి రా” బహిరంగ సభలోనూ జగన్‌పై చంద్రబాబు మరోసారి నిప్పులు చెరిగారు. విశాఖలో వైసీపీ నిర్వహిస్తున్న ”సిద్ధం” సభను ఇక్కడ ప్రస్తావిస్తూ.. అవినీతి డబ్బుతో ఎన్నికల సభల కోసం పెద్ద పెద్ద ఫ్లెక్సీలు సిద్ధమని పెడుతున్నారని మండిపడ్డారు. జగన్‌ను ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

యుద్ధం మొదలు.. మేమూ సిద్ధమే..

జగన్‌కు అభ్యర్థులు కూడా దొరకడం లేదన్నారు. జగన్‌ను ఇంటికి పంపడానికి యువత, రైతులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. జగన్ అధికార అహంకారాన్ని దించడానికి ప్రభుత్వ ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎన్నికల అనంతరం వైఎస్సార్ పార్టీ జెండా పీకేయడం తప్పదని స్పష్టం చేశారు. ”యుద్ధం ప్రారంభమైంది. యుద్ధానికి మేము సిద్ధం” అని తేల్చిచెప్పారు. కురుక్షేత్ర ధర్మ యుద్ధానికి జనసేన, టీడీపీ సిద్ధంగా ఉన్నాయన్నారు. 2019లో ముద్దులు పెట్టి బుగ్గలు నొక్కి మోసం చేశారన్నారు. ఒక్క అభివృద్ధి లేదు, ప్రాజెక్టు లేదు, పరిశ్రమ లేదని మండిపడ్డారు.

రతనాల సీమ కోసం…

”నేను రాయలసీమ బిడ్డను, నాలో ఉన్నది రాయలసీమ రక్తం. రాయలసీమను రతనాల సీమ చేయాలంటే ఏం చేయాలో అన్ని ఆలోచన చేశాను. హంద్రీనివాపై మేము రూ.4200 కోట్లు ఖర్చు పెట్టాం. జగన్ ఒక రూపాయి కూడా పెట్టలేదు. పీలేరు పుంగనూరులకు నీళ్లు రాలేదు. గాలేరు నగిరిపై రూ.1550 కోట్లు మేము ఖర్చు పెట్టాం” అని చంద్రబాబు వెల్లడించారు.