TRINETHRAM NEWS

Trinethram News : ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 ప్రిలిమ్స్‌ 2024 పరీక్ష ఫలితాలు బుధవారం (ఏప్రిల్‌ 10) కమిషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. పరీక్షలకు హాజరైన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. రాష్ట్రలోని వివిధ శాఖలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 899 గ్రూప్‌ 2 ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ ప్రకటన వెలువరించింది. ఇందుకు సంబంధించి ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్‌ 21 నుంచి జనవరి 17 వరకు కొనసాగింది. ప్రిలిమినరీ పరీక్షలను ఫిబ్రవరి 25న ఏపీపీఎస్సీ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4,04,037 మంది అభ్యర్ధులు హాజరయ్యారు.

పరీక్షకు హాజరైన లక్షలాది మంది అభ్యర్థులు కొన్ని వారాల నుంచి ఎంతో ఉత్కంఠగా ఈ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఎట్టకేలకు ఏపీపీఎస్సీ ఈ పరీక్ష ఫలితాలను వెలువరించింది. ప్రిలిమినరీ పరీక్షలొ దాదాపు 92,250 మంది మెయిన్స్‌కు క్వాలిఫై అయ్యారు. మరో 2557 మంది అభ్యర్థులను వివిధ కారణాలతో ఏపీపీఎస్సీ రిజెక్ట్‌ చేసింది. ఇందుకు సంబంధించిన ఫలితాలను ఏపీపీఎస్సీ తన వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. తదుపరి దశ అయిన మెయిన్స్‌కు అర్హత సాధించిన వారి వివరాలతోపాటు రిజెక్ట్ అయిన అభ్యర్థుల జాబితాలను కూడా వేర్వేరుగా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 మెయిన్స్‌ పరీక్షలు జులై 28న నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా కమిషన్‌ స్పష్టం చేసింది. కాగా మెయిన్స్‌కు 1 : 100 నిష్పత్తిలో అభ్యర్థులను కమిషన్‌ ఎంపిక చేసింది. ఇక త్వరలోనే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలను కూడా ఏపీపీఎస్సీ ప్రకటించనుంది.