
ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించిన ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు
Mundastu Badibata : డిండి (గుండ్లపల్లి) ఏప్రిల్01, త్రినేత్రం న్యూస్. నల్గొండ జిల్లా డిండి(గుండ్లపల్లి) మండలం చెరుకుపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ‘ముందస్తు బడిబాట‘ కార్యక్రమం బుధవారం ఉత్సాహంగా ప్రారంభమైంది. గ్రామపంచాయతీలోని రెండవ మరియు మూడవ వార్డు సభ్యులు ఎన్. హనుమంతు, బొడ్డు చిట్టెమ్మ, 6 వ వార్డు సభ్యులు ఎస్. అరుణా రెడ్డి, 7 వ వార్డు సభ్యులు చిన్న అంజయ్య, 9 వ వార్డు సభ్యులు నక్క శ్రీను ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానిక జెడ్పీహెచ్ఎస్ చెరుకుపల్లి గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఇస్లావత్ గోప్య నాయక్ పాఠశాల ఉపాధ్యాయ బృందంతో కలిసి పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలే పిల్లల భవితకు మార్గం:
ఈ సందర్భంగా వార్డు సభ్యులు మరియు ఉపాధ్యాయ బృందం గ్రామంలోని ఇంటింటికీ తిరుగుతూ, బడీడు పిల్లలను గుర్తించారు. తల్లిదండ్రులతో నేరుగా మాట్లాడి, తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా నడుస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని విజ్ఞప్తి చేశారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్యాబోధన అందుబాటులో ఉందని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన అందిస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహార మధ్యాహ్న భోజన పథకం గురించి వివరించారు. పాఠశాలల్లో క్రీడా ప్రాంగణాలు, మెరుగైన వసతులు మరియు చదువుకోవడానికి అనువైన వాతావరణం కల్పిస్తున్నట్లు తెలిపారు.
–ఉమ్మడి లక్ష్యం – నూటికి నూరు శాతం అడ్మిషన్లు:
గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఇస్లావత్ గోప్య నాయక్ మాట్లాడుతూ, గ్రామంలోని ప్రతి బిడ్డ అక్షరాస్యులుగా మారాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు మరియు ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలను పెంచాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ ముఖ్య నేతలు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

