
నాగ్పుర్: మహారాష్ట్ర లోని నాగ్పుర్ లో ఉన్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) ప్రధాన కార్యాలయాన్ని ‘నో డ్రోన్’ జోన్గా ప్రకటించారు. భద్రతా కారణాలరీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఈ ప్రాంతంలో ఫొటోలు తీయడం, వీడియో రికార్డు చేయడం, డ్రోన్లు ఎగురవేయడం నిషిద్ధమని ప్రకటించారు. జనవరి 29 నుంచి మార్చి 28 వరకు ఈ నిర్ణయం అమలులో ఉండనుంది.
నాగ్పుర్లోని మహల్ ప్రాంతంలో ఆరెస్సెస్ (RSS) ప్రధాన కార్యాలయం ఉంది. దీని చుట్టూ హోటళ్లు, లాడ్జీలు, కోచింగ్ సెంటర్లు ఉండటంతో నిత్యం రద్దీగా ఉంటుంది. ఇలాంటి ప్రాంతంలో ప్రజలు ఫొటోలు, వీడియోలు తీసే అవకాశం ఉందని, దీంతో భద్రతా కారణాలరీత్యా ఇక్కడ సీఆర్పీసీ సెక్షన్ 144 (1) (3) ఉత్తర్వులు అమలులో ఉండనున్నట్లు సంయుక్త పోలీస్ కమిషనర్ అశ్వతి డోర్జే తెలిపారు. ఈ ఉత్తర్వులను ఎవరైనా ఉల్లంఘిస్తే ఐపీసీ 188 సెక్షన్ కింద్ చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
