TRINETHRAM NEWS

తేదీ:28-01-2024
ఇటిక్యాల

రాజ్యాధికారమే లక్ష్యంగా పోరాటం చేయాలి: డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్

అధిపత్య పార్టీలకు ఓట్లు అమ్ముకోవద్దని పిలుపు

రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా బహుజనులు రాజకీయ పోరాటానికి సిద్దం కావాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం సాతర్లలో భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్.అంబేద్కర్ విగ్రహాన్ని ఆదివారం ఆవిష్కరించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బహుజన మహనీయుల విగ్రహాలతో పాటు, బహుజనవాదం బలమైన శక్తిగా మారి,రాజకీయ ఉద్యమంగా మారితేనే బహుజనులకు రాజ్యాధికారం దక్కుతుందని అన్నారు. రాజ్యాధికారంతోనే బహుజనులు తలరాతలు మారతాయన్న ఆయన ఆ దిశగా రాజకీయంగా పోరాటాన్ని ఉధృతం చేయాలన్నారు.

రాజ్యాంగంలో కుల,మతాలకు అతీతంగా డా.బి.ఆర్.అంబేడ్కర్ కల్పించిన ఓటు హక్కును బీరు, బిర్యానీ,డబ్బులకు అమ్ముకోవద్దని కోరారు.బీసీ,ఎస్సీ,ఎస్టీ వర్గాల ప్రజలు రాయితీలు,సంక్షేమ పథకాలకు రాజీపడి, ఆధిపత్య పార్టీలకు ఓట్లు వేయకుండా పేద వర్గాల సంక్షేమం కోసం పోరాడుతున్న బీఎస్పీకి ఓట్లు వేయాలన్నారు. సామాజిక న్యాయమే లక్ష్యంగా బీసీ,ఎస్సీ, ఎస్టీ,మైనార్టీ, అగ్రకుల పేదల అభివృద్ధి కోసం బీఎస్పీ నిరంతరం పోరాడుతుందన్నారు. ఈ సమావేశంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు ఎం.సి కేశవరావు, నాయకులు ఎం.జి.కృష్ణ,బండి పృథ్విరాజ్, రెహమాన్ మధు గౌడ్, తురుపాల్, రవిచంద్ర, శారద,గ్రామ సర్పంచ్ ఉండవల్లి జయచంద్ర రెడ్డి, ఎంపీటీసీ లత చంద్ర గౌడ్,ఉప సర్పంచ్ రామన్న,మాజీ సర్పంచ్ వెంకటన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు.