వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: వికారాబాద్ జిల్లాలో నకిలీ విత్తనాలు, ఏరువులు విక్రయించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ హెచ్చరించారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వానకాల పంటల సంసిద్ధత సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విత్తనాలు, ఎరువుల సరఫరా, లభ్యత, టాస్క్ ఫోర్స్, అంతర్గత బృందాలు, నకిలీ విత్తనాల నిరోధన, నాణ్యత ప్రమాణాలపై వ్యవసాయ శాఖ, పోలీస్ అధికారులతో జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి తో కలిసి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ. జిల్లాలో నకిలీ విత్తనాలు,ఎరువులు విక్రయించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారువ్యవసాయ,పోలీస్ అధికారులు సమన్వయంతో పని చేస్తూ నకిలీ విత్తనాలను అరికట్టడంలో ఎలాంటి ఒత్తిడీలకు లొంగకుండా తమ విధులను నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. జిల్లా సరిహద్దుల్లో కూడా టాస్క్ ఫోర్స్ బృందాలు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.
ప్రభుత్వం వ్యవసాయ రంగానికి వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టుతుందని దీనికి అనుగుణంగా వ్యవసాయ రంగం వృద్ధిలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని కలెక్టర్ తెలిపారు. వ్యవసాయ, పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో ఉన్న 538 ఎరువులు, విత్తనాల విక్రయ దుకాణాలను ఎప్పటికపుడు అధికారులు తనిఖీలు చేపట్టాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. విత్తనాల నాణ్యతను పరిశీలించాలని ఆయన తెలిపారు.
జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి మాట్లాడుతూ. నకిలీ విత్తనాలు విక్రయించిన వారిపై పిడి చట్టమును ప్రయోగించి చర్యలు తీసుకుంటామన్నారు. నకిలీ విత్తనాల వల్ల రైతులు పంటలు కోల్పోవడంతో ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయని, రైతులను కాపాడుకోవలసిన బాధ్యత మన అందరిపై ఉందని ఆయన తెలిపారు. నకిలీ విత్తనాలు ఎక్కడైనా విక్రయిస్తున్నట్లు అధికారులు తమ దృష్టికి తీసుకువచ్చినట్లయితే వారిపై వెంటనే చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని ఎస్పీ తెలిపారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి, డిహెచ్ఎస్ఓ సత్తార్, వ్యవసాయ, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


