మాజీ సీఎం కేసీఆర్‌ మోసపూరితంగా వ్యవహరించారని నల్గొండ జిల్లా కాంగ్రెస్‌ నేతలు విమర్శించారు

TRINETHRAM NEWS

నల్గొండ : భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ మోసపూరితంగా వ్యవహరించారని నల్గొండ జిల్లా కాంగ్రెస్‌ నేతలు విమర్శించారు. కృష్ణా నది ప్రాజెక్టుల వ్యవహారంపై పట్టణంలో నేడు భారాస సభ నేపథ్యంలో క్లాక్‌టవర్‌ సెంటర్‌ వద్ద అధికార పార్టీ నాయకులు వినూత్న నిరసన తెలిపారు. కేసీఆర్‌ చిత్రపటాన్ని కుర్చీలో పెట్టి ఆందోళన చేపట్టారు. 2014, 2019 ఎన్నికల ప్రచారానికి వచ్చిన భారాస అధినేత.. ‘నల్గొండ జిల్లాలోని తాగు, సాగునీటి ప్రాజెక్టులను కుర్చీ వేసుకుని కూర్చొని మరీ పూర్తి చేస్తా’మన్నారంటూ సంబంధిత వీడియోను ఎల్‌ఈడీ స్క్రీన్‌పై ప్రదర్శించారు. ఏపీ అసెంబ్లీలో కేసీఆర్‌ను సీఎం జగన్‌ పొగిడిన వీడియోనూ ప్రసారం చేశారు.  
డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌ మాట్లాడుతూ జిల్లాలో తాగునీటి ప్రాజెక్టులను కేసీఆర్‌ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. 90 శాతం పూర్తయిన వాటిని కూడా పట్టించుకోకపోవడంతో సాగు, తాగునీటి ఎద్దడి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండ ప్రజలకు క్షమాపణ చెప్పాకే ఆయన అడుగుపెట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు తుమ్మల మోహన్‌రెడ్డి, మున్సిపల్‌ ఛైర్మన్‌ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

You cannot copy content of this page

Scroll to Top