TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్‌ : రైతు రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని.. రైతుల అప్పుల వివరాలు సేకరించే పనిలో ప్రభుత్వం ఉందని, పూర్తి సమాచారం రాగానే కార్యరూపం దాల్చుతుందని ధరణి కమిటీ సభ్యుడు ఎం.కోదండరెడ్డి తెలిపారు. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, కాంగ్రెస్‌ ఫిషర్‌మెన్‌ కమిటీ ఛైర్మన్‌ మెట్టు సాయికుమార్‌, ఎస్సీ సెల్‌ ఛైర్మన్‌ ప్రీతం తదితరులతో కలిసి ఆయన సోమవారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అక్రమంగా భూములు పొందిన అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ధాన్యంకు మద్దతు ధర కంటే తక్కువ వచ్చినప్పుడు బోనస్‌ రూ.500 ఇస్తామని చెప్పాం.. కానీ ప్రస్తుతం మద్దతు ధర రూ.2060 కాగా.. కొనుగోలు కేంద్రాల్లో రూ.2600 ఇస్తున్నారు.. అందుకే బోనస్‌ గురించి ప్రస్తావించలేదని చెప్పారు. జగ్గారెడ్డి మాట్లాడుతూ శాసనసభకు రాకుండా మాజీ సీఎం కేసీఆర్‌ ప్రజల తీర్పును అవమానిస్తున్నారన్నారు.