TRINETHRAM NEWS

జోడోయాత్రలో ఉద్రిక్తతలు.. రాహుల్‌ భద్రతపై కాంగ్రెస్‌ ఆందోళన

Trinethram News : దిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) నేతృత్వంలో అస్సాంలో జరుగుతున్న భారత్‌ జోడో న్యాయ యాత్ర(Bharat Jodo Nyay Yatra)లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే..

ఈ నేపథ్యంలో రాహుల్ భద్రతపై ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా( Amit Shah)కు లేఖ రాశారు. ఇటీవల చోటుచేసుకున్న భద్రతాపరమైన లోపాలను దానిలో ఎత్తిచూపారు.

భారత్‌ జోడో న్యాయ యాత్ర(Bharat Jodo Nyay Yatra) గువాహటి నగరంలోకి ప్రవేశించకుండా పోలీసులు మంగళవారం భారీగా బారికేడ్లను అడ్డుపెట్టారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు వీటిని తోసుకుని ముందుకు దూసుకెళ్లారు. దీంతో రెండు వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుని.. ఉద్రిక్తతకు దారితీసింది. హింసాత్మక ఘటనలు, రెచ్చగొట్టడం, ప్రజా ఆస్తులకు నష్టం కలిగించడం, పోలీసు సిబ్బందిపై దాడి వంటి చర్యలకు కారణమయ్యారంటూ రాహుల్‌, ఇతర నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ క్రమంలోనే కేంద్ర హోంమంత్రికి ఖర్గే లేఖ రాశారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్‌ ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా వెల్లడించారు. పార్టీ పోస్టర్లను చించివేయడం, భాజపా కార్యకర్తలు యాత్రను అడ్డుకోవడం, నేతలపై దాడి చేయడం వంటి అంశాలను లేఖలో ప్రస్తావించారు. సాక్ష్యాలు ఎదురుగా కనిపిస్తున్నప్పటికీ.. ఈ ఘటనల్లో ప్రమేయం ఉన్న వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోలేదని హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వ తీరును ఎండగట్టారు.

హిమంత రిమోట్‌ అమిత్‌ షా చేతిలో..

‘ద్వేషం, భయాన్ని అస్సాం ముఖ్యమంత్రి వ్యాప్తి చేస్తున్నారు. దేశంలో అత్యంత అవినీతిపరుడైన సీఎం ఆయన. ఆయన కోరుకునేదే మీడియా చూపిస్తోంది. ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్నది హిమంత కాదు. దీని రిమోట్‌ అమిత్‌ షా చేతుల్లో ఉంది’ అంటూ బుధవారం యాత్రలో భాగంగా రాహుల్ కార్యకర్తలతో మాట్లాడారు.