TRINETHRAM NEWS

Rs. 7 thousand pension per person on July 1

_ ఏపీ కొత్త సర్కార్ కసరత్తులు షురూ!

Trinethram News : అమరావతి : ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి (టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ) ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

వీరి విజయానికి ఎన్నికలకు ముందు కూటమి ప్రకటించిన ఉమ్మడి మేనేఫెస్టో కూడా ఒక కారణం.

అందులో ఫించన్ల పెంపు అంశం సామాన్యుడిని అమితంగా ఆకర్షించిందని ప్రత్యేకగా చెప్పనవసరం లేదు.

వృద్ధాప్య పింఛన్‌ రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేలకు పెంచుతామని హామీనిచ్చాయి.

ఏప్రిల్‌ నెల నుంచే పెరిగిన సామాజిక భద్రత పింఛన్లను అందిస్తామని హామీ ఇచ్చింది.

పెరిగిన పింఛన్‌ జులై 1వ తేదీన అందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 65.30 లక్షల మంది పింఛను లబ్ధిదారులుండగా..

ఇప్పటి వరకు పింఛను నగదు చెల్లింపులకుగాను నెలకు రూ.1,939 కోట్లను ప్రభుత్వం విడుదల చేస్తూ వచ్చింది.

ఏప్రిల్‌ నుంచే రూ.4 వేల పింఛను పెంపు అమలు చేస్తే ఒక్కొక్కరికి రూ.7 వేల చొప్పున జులై 1న పింఛను పంపిణీ చేయవల్సి ఉంటుంది.

పెరిగిన పింఛను రూ.4 వేలుతోపాటు ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలకు రూ.1000 చొప్పున రూ.3 వేలు మొత్తం కలిపి వచ్చే నెలలో ఒక్కొక్కరికి రూ.7 వేలు పంపిణీ చేయనున్నారు.

మరోవైపు దివ్యాంగులకు రూ.6 వేల చొప్పున పింఛను జులై 1న పంపిణీ చేయడానికి రూ.4,400 కోట్లు అవసరం అవుతాయని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.

ఆగస్టు నుంచి అయితే నెలకు రూ.2,800 కోట్లు వ్యయం అవుతుందని లెక్కగట్టిన అధికారులు.. ఈ నివేదికను ప్రభుత్వానికి అందించనున్నారు.

దివ్యాంగ పింఛనుదారులు రాష్ట్రవ్యాప్తంగా 8 లక్షల మంది ఉన్నారు. వీరికి ప్రస్తుతం రూ.3 వేలు పింఛను అందిస్తున్నారు. వీరి పింఛనును రూ.6 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు.

పూర్తిస్థాయిలో వైకల్యానికి గురైన వారికి నెలకు రూ.15 వేలు, కిడ్నీ, తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.10 వేల పింఛను అందిస్తామని కూటమి మేనేఫెస్టోలో పేర్కొంది.

వీరందరి వివరాలను వైద్యశాఖ నుంచి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు సేకరిస్తున్నారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీటీలకు కూడా 50 ఏళ్లకే పింఛను అమలు చేస్తామని ఉమ్మడి మ్యానిఫెస్టోలో ప్రకటించారు.

ఈ సామాజిక వర్గాల్లో 50 ఏళ్లు పైబడిన వారు ఎంత మంది ఉన్నారు అనే వివరాలను కూడా సమీకరిస్తున్నారు. రేపు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మంత్రి మండలి కూర్పు జరుగుతుంది.

ఆ తర్వాత రాష్ట్రంలో కూటమి సర్కార్ పాలన కొనసాగుతుంది.

అనంతరం జులై 1న పింఛను పంపిణీ సాధ్యాసాధ్యాలపై సర్కార్‌ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Rs. 7 thousand finchan per person on July 1