TRINETHRAM NEWS

రేవంత్‌రెడ్డి, వెంకటరెడ్డి చెప్పిందే గుర్తుచేశా.. 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్తుపై కేటీఆర్‌
హైదరాబాద్ :-తనది విధ్వంసకర మనస్తత్వం అంటూ మంత్రి భట్టి విక్రమార్క చేసిన కామెంట్లపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ట్విట్టర్‌ (ఎక్స్‌) వేదికగా స్పందించారు. 200 యూనిట్ల లోపు విద్యుత్‌ బిల్లులు కట్టవద్దని సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారని ఆయన గుర్తుచేశారు. తాను కేవలం ఆ ప్రకటనలను మాత్రమే గుర్తుచేశానని వివరించారు. సోనియా గాంధీనే కరెంట్‌ బిల్లులు కట్టే బాధ్యతను తీసుకుంటారని సీఎం స్పష్టంగా చెప్పారని కూడా తెలిపారు. ఈ మేరకు రేవంత్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో చేసిన ప్రకటనలకు సంబంధించిన వీడియోలను కూడా షేర్‌ చేశారు.

200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్తు అందించేలా తక్షణమే ఆదేశాలు ఇవ్వాలని ఈ సందర్భంగా మంత్రి మల్లు భట్టి విక్రమార్కను కేటీఆర్‌ కోరారు. అలా కాకుండా డిస్కంలు ఏవైనా చర్యలకు దిగితే కరెంటు బిల్లులను 10, జన్‌పథ్‌కు పంపించే కార్యక్రమాన్ని మొదలుపెడతామని స్పష్టం చేశారు.