TRINETHRAM NEWS

Andhra Pradesh: ప్చ్.. మాకు టికెట్ వస్తుందో.. రాదో..! వైసీపీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి, ఆవేదన..

YSRCP MLAs Changing: అనేక రాజకీయ, సామాజిక అంశాలను పరిగణనలోకి తీసుకుని పార్టీ కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. ఆ నిర్ణయాలు ఎలా ఉంటాయి.. ఎందుకు తీసుకుంది అనే విషయం ఒక్కోసారి ఎవరికీ అర్థం కానట్టుగా ఉంటాయి. అలా పార్టీ తీసుకున్న నిర్ణయాల్లో కొంతమంది నేతలు బాధితులుగా మిగిలిపోతుంటారు. అలాంటి బాధితులు బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టార్గెట్ ఫిక్స్ అయింది. వైనాట్ 175 అంటూ ఏపీ అధికార పార్టీ ముందుకు వెళ్తోంది. ఎక్కడైనా అభ్యర్థి మీద వ్యతిరేకత ఉందని తెలిసినా.. సర్వేలు ప్రతికూలంగా ఉన్నా వెంటనే అభ్యర్థిని మార్చేస్తోంది వైసీపీ. ఇప్పటికే పలు స్థానాల్లో మార్పులు జరగ్గా.. పెద్ద మొత్తంలో మార్పులు చేసేందుకు అధికార పార్టీ కసరత్తు చేస్తోంది. ఈ మొత్తం ప్రక్రియలో పలువురు నేతలు అసంతృప్తి, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

డొక్కా మాణిక్యవర ప్రసాద్ ఆవేదన.. గుంటూరు జిల్లా తాడికొండలో జరిగిన సాధికార యాత్రలో తన ఆవేదనను వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవర ప్రసాద్. ప్రత్యక్ష రాజకీయాలపై తనకు ఆసక్తి లేకపోయినా తాడికొండ బాధ్యతలు అప్పగించారన్న డొక్కా.. ఆ బాధ్యతల నుంచి అర్థాంతరంగా తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు రాజకీయాల్లో పోటీ చేయాలన్న ఆశ లేదని.. ఒక్కసారి జగన్‌తో మాట్లాడలన్న కోరిక మాత్రమే ఉందన్నారు. పార్టీ పెద్దలు కలగజేసుకుని జగన్‌తో మాట్లాడించాలని కోరారు.

ఎమ్మెల్యే పార్ధసారధి సైతం అసంతృప్తిరాగం వైసీపీ మరో ఎమ్మెల్యే పార్ధసారధి సైతం అసంతృప్తిరాగం వినిపించారు. దురదృష్టవశాత్తూ తమ నాయకుడు తనను గుర్తించలేదన్నారు. కానీ నియోజకవర్గ ప్రజలు తన వెంట ఉన్నందుకు రుణపడి ఉంటానన్నారు. సేవకుడిగా ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. సాధికార యాత్ర సభలోనే ఈ వ్యాఖ్యలు చేయడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

గతంలో పామర్రు సాధికార సభలో కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు పార్థసారధి. తనకు సీటు వస్తుందో లేదో తెలియదని గతంలో కామెంట్ చేశారు. పార్థసారధిని వేరే నియోజకవర్గం పంపించే యోచనలో అధిష్ఠానం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే అధిష్ఠానం నిర్ణయంపై పార్ధసారథి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

పార్టీలో మరికొందరు నేతల్లోనూ ఇలాంటి వైరాగ్యం కనిపిస్తోంది. అయితే ఏది ఏమైనా పార్టీ నిర్ణయానికి కాబట్టి కట్టుబడి ఉండాలనే నిర్ణయానికి వస్తున్నారు కొందరు నేతలు. మరికొందరు మాత్రం టికెట్ కోసం చివరి నిముషం వరకు ప్రయత్నాలు చేస్తున్నారు.