TRINETHRAM NEWS

Petrol Price: మోదీ నూతన సంవత్సర కానుక… పెట్రోల్ ధరలు తగ్గనున్నాయ్..!

ఢిల్లీ: వాహన చోదకులకు గుడ్ న్యూస్. ఇంధన ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. 2024లో లోక్‌సభ ఎన్నికలు రానున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలకు ముందే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉంది..

ఇంధన ధరల్లో భారీ కోత ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. పెట్రోల్ ధరపై రూ.10 వరకూ తగ్గే అవకాశం ఉందని వెల్లడించారు..

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. మే 2022లో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని లీటరుకు వరుసగా రూ.8, రూ.6 తగ్గించింది. ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.96.72కు విక్రయిస్తుండగా, డీజిల్ రూ.89.62గా ఉంది. ముంబైలో లీటరు పెట్రోల్ రూ.106.31, డీజిల్ రూ.94.27గా ఉంది. రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా.. పెట్రోలియం శాఖ మంత్రి చమురు ధరలను తగ్గించనున్నట్టు ప్రకటించారు..

మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు.. చమురు సంస్థలను లాభాల బాటలో నడిపించాయి. దీంతో లీటర్‌పై రూ.10 వరకూ లాభం వస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో దేశీయ చమురు సంస్థలు నష్టాల్లో ఉన్నప్పుడు కేంద్రం రాయితీలు, ఆర్థిక సాయం అందించి అండగా నిలిచింది. ప్రస్తుతం లాభాలు వస్తుండటంతో ఇక ఇంధన ధరలను తగ్గించినా కూడా ఇబ్బంది లేదని కేంద్రం భావిస్తోంది. ఈ క్రమంలోనే నూతన సంవత్సర కానుకగా పెట్రోల్ ధరలను తగ్గించాలని కేంద్రం యోచిస్తోంది..