TRINETHRAM NEWS

కక్ష్యలోకి ఇన్సాట్‌-3డీఎస్‌ ఉపగ్రహంకొనసాగుతున్న కౌంట్‌డౌన్‌

శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మరో రాకెట్‌ ప్రయోగానికి సిద్ధమైంది..

తిరుపతి జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌(శ్రీహరికోట) నుంచి శనివారం సాయంత్రం 5.35 గంటలకు జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌14 ప్రయోగానికి శాస్త్రవేత్తలు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ప్రయోగానికి ముందుగా నిర్వహించే కౌంట్‌డౌన్‌ ప్రక్రియ శుక్రవారం మధ్యాహ్నం 2.05 గంటలకు ప్రారంభమైంది. ఇది నిరంతరాయంగా 27.30 గంటలపాటు కొనసాగిన తర్వాత షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌14 దూసుకెళ్లనుంది. ఇస్రో అధిపతి డాక్టర్‌ సోమనాథ్‌ గురువారం అర్ధరాత్రి షార్‌కు చేరుకుని, కౌంట్‌డౌన్‌ ప్రక్రియను పర్యవేక్షిస్తూ..

శాస్త్రవేత్తలకు, సూచనలు చేశారు. జీఎస్‌ఎల్‌వీ వాహకనౌక 2,275 కిలోల బరువు గల ఇన్సాట్‌-3డీఎస్‌ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో ప్రవేశ పెట్టనుంది. ఈ ఉపగ్రహాన్ని వాతావరణ పరిశీలనలను మెరుగుపరచడానికి, భూమి, సముద్ర ఉపరితలాలను పర్యవేక్షించడానికి రూపొందించారు. తద్వారా వాతావరణ అంచనా, విపత్తు హెచ్చరిక వ్యవస్థలను మెరుగుపరుస్తుంది. ప్రస్తుతం కక్ష్యలోని ఇన్సాట్‌-3డీ, ఇన్సాట్‌-3డీఆర్‌ ఉపగ్రహాలతో కలిసి పనిచేయనుంది..