TRINETHRAM NEWS

మహేశ్వరం : ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒక ఉద్యోగం సాధించడమే కష్టం. అలాంటిది మూడు ఉద్యోగాలు సాధించి గిరిజన మహిళ సత్తా చాటింది.. మహేశ్వరంలోని కావాలోనిభాయి తండా(కేబీతండా)కు చెందిన నేనావత్‌ స్వాతి.. నిరుపేద కుటుంబానికి చెందిన ఈమె.. గురుకుల విద్యాలయ ఉద్యోగ నియామక ఫలితాల్లో జూనియర్‌ కళాశాల రసాయన శాస్త్ర అధ్యాపకురాలిగా, పీజీటీ-ఫిజికల్‌ సైన్స్‌, టీజీటీ- ఫిజికల్‌ సైన్స్‌ ఉపాధ్యాయురాలిగా అర్హత సాధించింది.. కష్టాలను అధిగమించి ఇతరులకు స్వాతి స్ఫూర్తిగా నిలుస్తోంది. కుటుంబ బాధ్యతలు మోస్తూనే పీహెచ్‌డీ చదువుతోంది. ఐదున్నరేళ్ల కుమారుడిని చూసుకుంటూనే అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది. కలల కొలువు సాధించడానికి నిరంతరం శ్రమించింది. భర్త గణేష్‌, తల్లి జీజాభాయి, తండ్రి లక్ష్మణ్‌నాయక్‌ల సహకారంతో తాను కొలువులు సాధించినట్లు ఆమె చెప్పింది. తల్లిదండ్రులిద్దరూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారి కష్టాన్ని చూసి.. చిన్నతనం నుంచి ఎంతో కష్టపడి చదువుకున్నట్లు ఆమె తెలిపింది. ప్రస్తుతం ఐఐసీటీ-హబ్సిగూడలో పీహెచ్‌డీ చేస్తున్నట్లు వెల్లడించింది…..