TRINETHRAM NEWS

Trinethram News : విజయవాడ, ఫిబ్రవరి 1: ఏపీలో త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఎవరెవరికి టికెట్ లభిస్తుందా అనే ఉత్కంఠ అన్ని పార్టీల నేతల్లో నెలకొంది. ఇటు టీడీపీలో కూడా పలువురు నేతలు టికెట్ కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు..

అయితే టీడీపీ – జనసేన పొత్తు నేపథ్యంలో సీట్ల పంపకాలు ఎలా ఉండబోతున్నాయనే ఉత్కంఠ కూడా నెలకొంది. అయితే విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే టికెట్ లేదా అనకాపల్లి ఎంపీ సీటును టీడీపీ నేత బుద్దా వెంకన్న (TDP Leader Budda Venkanna) ఆశిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తనకు టిక్కెట్ ఇవ్వాలంటూ టీడీపీ నేత బుద్దా వెంకన్న గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఇంద్రకీలాద్రి దిగువన ఉన్న కామధేను అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. తనకు టిక్కెట్ వచ్చేలా చూస్తే మొక్కుబడులు చెల్లించుకుంటానంటూ అమ్మవారికి బుద్దావెంకన్న వేడుకున్నారు..

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ”టీడీపీ కోసం నేను ఎంతో కష్టపడి పని చేస్తున్నా. నా సేవలను గుర్తించి చంద్రబాబును (TDP Chief Chandrababu Naidu) నాకు సీటు ఇవ్వాలని కోరుతున్నా. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే లేదా, అనకాపల్లి ఎంపీ సీటు కోరుతున్నాను. దుర్గమ్మను వేడుకుంటూ నా దరఖాస్తును ఆమె పాదాల చెంత ఉంచా. నాకు ఈ అమ్మవారు ఇలవేల్పు అయితే. నాకు రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబు నాకు దేవుడు. వీళ్లనే నేను నమ్ముకుని ముందుకు సాగుతున్నా. జనసేన, టీడీపీ పొత్తులో ఉన్నా… నాకు సీటు ఇవ్వాలని కోరుతున్నా. చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్‌కు (Janasena Chief Pawan Kalyan) కూడా నా విజ్ఞప్తి. వైసీపీ రౌడీలను అనేక సందర్భాల్లో ధైర్యంగా ఎదుర్కొన్నా. చంద్రబాబు ఇంటి మీదకు వస్తే దమ్ముగా నిలబడ్డా. నాడు బూతుల మంత్రిగా ఉన్న కొడాలి నాని (Former Minister Kodali Nani) నోరు గుడివాడ వెళ్లి మూపించా. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేస్తే… పోరాటం చేశా. టీడీపీ, జనసేన పొత్తు తరువాత చాలా మంది సీట్ల కోసం పార్టీలోకి వస్తున్నారు. మొదటి నుంచీ పార్టీ కోసం పని చేసే వారికి ప్రాధాన్యత ఇవ్వాలి. నాకు ఈ రెండు స్థానాల నుంచి ఎక్కడో ఒకచోట ఇవ్వాలి. సీట్ల కేటాయింపులో చంద్రబాబుదే అంతిమ నిర్ణయం. ఎవరైనా బ్లాక్ మెయిల్ చేస్తే వారి తాట తీస్తా. నా సేవలను, ప్రాణాలకు తెగించి పని చేస్తున్న నా పని గుర్తిస్తూ సీటు ఇవ్వమంటున్నా” అంటూ బుద్దా వెంకన్న విజ్ఞప్తి చేశారు..