TRINETHRAM NEWS

Earthquake In Nepal: న్యూ ఇయర్ వేళ నేపాల్‎లో భూకంపం.. మరిన్ని సంభవించే అవకాశం ఉందన్న నిపుణులు

ప్రపంచ వ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకల్లో మునిగి తేలుతుండగా నేపాల్ వాసులకు భూకంపం షాకిచ్చింది. నేపాల్‎లో ఆదివారం రాత్రి భూకంపం సంభవించింది. పదకొండున్నర గంటల ప్రాంతంలో పలు చోట్ల భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.3గా నమోదైంది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. నేపాల్ రాజధాని ఖాట్మండుకు తూర్పున 56 కిలోమీటర్ల దూరంలో తాజాగా భూకంపం సంభవించింది. ప్రజలు ప్రాణ భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేస్తున్నవారు సైతం కాస్త ఆందోళన చెందారు. ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

నేపాల్ భూకంపం ప్రభావం ఢిల్లీతో పాటు ఉత్తర భారతదేశం మొత్తం కనిపించింది. అయితే.. ఇది ఇప్పట్లో అంతం కాదని అంటున్నారు నిపుణులు. నేపాల్‌లో మరిన్ని భారీ భూప్రకంపనలు వచ్చే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. హిమాలయాలు, నేపాల్ మధ్య ప్రాంతంలోని ప్రజలు మరిన్ని భూకంపాలను ఎదుర్కొవాల్సి ఉంటుందని భూకంప శాస్త్రవేత్త అజయ్ పాల్ హెచ్చరించారు. గతంలో నవంబర్ 3న అర్థరాత్రి వచ్చిన భూ ప్రకంపనల మూలం నేపాల్‌లోని దోటీ జిల్లాకు సమీపంలో ఉందని ఆయన తెలిపారు. 2023 ఇయర్ ఎండింగ్‎లో ఒకే ప్రాంతంలో వరుసగా పలుమార్లు ప్రకంపనలు వచ్చాయని చెప్పారు. భూకంపం వచ్చిన ఈ ప్రాంతం నేపాల్ మధ్య భాగంలో ఉండటం ఆందోళన కలిగించే విషయమని అంటున్నారు భూకంప శాస్త్రవేత్త అజయ్ పాల్.