TRINETHRAM NEWS

పదో తరగతి పరీక్షల నేపథ్యంలో సెల్‌ఫోన్ల వినియోగంపై అధికారులు కఠిన ఆంక్షలు విధించారు. ఈ నెల 18 నుంచి ఏప్రిల్‌ 2 వరకు పరీక్షలు జరుగుతాయి.ఈ సమయంలో పరీక్షాకేంద్రాలను ‘నో సెల్‌ఫోన్‌’ జోన్లుగా ప్రకటించారు. పరీక్ష సిబ్బంది, స్కాడ్‌ సహా ఇతర అధికారులందరికీ ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఇక తనిఖీలకు వచ్చే అధికారులు, కలెక్టర్లు, పోలీస్‌, విద్యాశాఖ ఉన్నతాధికారులు సెంటర్లల్లోకి సెల్‌ఫోన్లు తీసు కెళ్లడాన్ని అనుమతించరు. వీరు తమ సెల్‌ఫోన్లను ఆరుబయటే పెట్టాల్సి ఉంటుంది.పోలీసులు తనిఖీలు చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తారు. ఒకవేళ ఎవరైనా ఈ నిబంధనలు ఉల్లంఘించి సెల్‌ఫోన్లతో విధులకు హాజరైతే వారిని సస్పెండ్‌చేస్తారు. పేపర్‌ లీకేజీలకు పాల్పడితే ఉద్యోగం నుంచి తొలగిస్తారు. నిరుడు పదో తరగతి ప్రశ్నపత్రాలు వాట్సాప్‌లలో ప్రత్యక్షంకావడం.. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో ఎస్సెస్సీ బోర్డు ఈ నిర్ణయం తీసుకొన్నది.ఈ ఏడాది పదోతరగతి వార్షిక పరీక్షలకు 5.08లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా 2,676 పరీక్షాకేంద్రాలను ఏర్పా టు చేశారు. పరీక్షల నిర్వహణ దృష్ట్యా రాష్ట్రస్థాయిలో కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఏమైనా సమస్యలుంటే -23230942 నంబర్‌ను సంప్రదించవచ్చు. ఈ పరీక్షల నిర్వహణ దృష్ట్యా ఇప్పటికే 12 మంది ఉన్నతాధికారులను జిల్లాస్థాయి అబ్జర్వర్లుగా నియమించారు. విద్యార్థుల హాల్‌టికెట్లను ఇప్పటికే స్కూళ్లకు పంపించగా, విద్యార్థులు నేరుగా వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌చేసుకునే అవకాశాన్నిచ్చారు. విద్యార్థులు హాల్‌టికెట్‌ చూపిస్తే ఆర్టీసీ బస్సుల్లో పరీక్షాకేంద్రాల సమీప స్టేషన్‌ వరకు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇప్పటికే ఎస్సెస్సీ బోర్డు నామినల్‌రోల్స్‌, ఫొటో అటెండెన్స్‌ షీట్లు జిల్లాలకు చేర్చగా, తాజా గా ఓఎమ్మార్‌, ప్రశ్నపత్రాలు, సమాధానాల రాసే పేపర్లు, బుక్‌లెట్‌లను జిల్లాలకు పంపిస్తుస్నది.