రాజధాని అమరావతి కేసుల విచారణ ఏప్రిల్కు వాయిదా
రాష్ట్ర రాజధాని అమరావతి కేసుల విచారణను అత్యున్నత న్యాయస్థానం ఏప్రిల్కు వాయిదా వేసింది. ఏప్రిల్లో సుదీర్ఘంగా వాదనలు విన్న తరువాతే నిర్ణయం తీసుకుంటామని సుప్రీం ధర్మాసనం తేల్చి చెప్పింది.
అమరావతే రాజధాని అంటూ గతంలో ఎపి హైకోర్టు తీర్పు ఇవ్వగా.. ఆ తీర్పును ఎపి ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. బుధవారం ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.
మూడు రాజధానుల చట్టాలను ఉపసంహరించుకున్నా.. హైకోర్టు తీర్పు ఇవ్వడం సమంజసం కాదని ఎపి ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదించారు. ఈ కేసులో ఇంకా లిఖితపూర్వక అఫిడవిట్లు దాఖలు చేయడం పూర్తి కాలేదని రైతుల తరపున న్యాయవాది దేవదత్ కామత్ వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న సుప్రీంకోర్టు.. నాలుగు వారాల్లోగా అఫిడవిట్లు, కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్కు వాయిదా వేసింది.