TRINETHRAM NEWS

Trinethram News : సీఎం జగన్‌ మెచ్చిన ఐఏఎస్ అధికారి, ఇప్పుడేమో రాజకీయ ప్రత్యర్థిగా!

శ్రీకాంత్ కోండ్రు (బాపట్ల )

ఏపీలో మరో నూతన రాజకీయ పార్టీ అవతరించింది. మాజీ ఐఏఎస్ అధికారి విజయ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో కొత్త పార్టీ రూపుదాల్చింది.
గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా ఉన్న ప్రాంతంలో అధిక జన మహా సంకల్ప సభ నిర్వహించారు. ఈ సభలో విజయ్ కొత్త రాజకీయ పార్టీ ప్రకటన చేశారు. ‘ లిబరేషన్ కాంగ్రెస్’ పేరుతో నూతన పార్టీ పెడతున్నట్లు విజయ్‌కుమార్ ప్రకటించారు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. రాష్ట్రంలో ‘లిబరేషన్‌ కాంగ్రెస్‌ పార్టీ’ని ఏర్పాటు చేసినట్టు రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారి విజయ్‌ కుమార్‌ ప్రకటించారు. గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అధికజన మహాసంకల్ప సభలో ఆయన పార్టీ పేరును ప్రకటించారు. ముఖ్యమంత్రి జగన్‌.. పేదల కోసం యుద్ధం చేస్తా అంటున్నారుని.. పెత్తందార్లు దోచుకున్న భూములను పేదలకిచ్చి నిజాయితీ చాటుకోవాలన్నారు. దౌర్జన్యంగా లాక్కున్న వారికి ఆస్తులు చెందేలా చట్టాన్ని మార్చారని.. సర్వే చేయించి అసలైన లబ్ధిదారులకు భూములు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రులకు వెళ్లలేక గిరిజన మహిళలు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

విజయ్‌కుమార్ గతంలో ఏపీ సీఎం జగన్‌ సర్కారులో కూడా కీలకంగా పనిచేశారు. అయితే విజయ్ పలుమార్లు జగన్‌పై పొగడ్తల వర్షం కురిపించారు. దీంతో విజయ్‌కుమార్ వైఎస్సార్‌సీపీలో చేరతారని.. ప్రకాశం జిల్లాలోని ఓ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ఆయన పాదయాత్ర కూడా చేపట్టారు. విజయ్ వైఎస్సార్‌సీపీలో చేరడం లాంఛనమేనని అనుకుంటున్న సమయంలో.. పరిణామాలు వేగంగా మారాయి. విజయ్ కుమార్ పోటీ చేద్దామనుకున్న నియోజకవర్గానికి వైఎస్సార్‌సీపీ కొత్త అభ్యర్థిని ప్రకటించింది. దీంతో ఆయన అనుహ్యంగా ఆయన కొత్త పార్టీని ప్రకటించారు. ఆయన కొత్త పార్టీని పెట్టి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు.

సీనియర్ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్.. సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితంగా మెలిగిన ఐఏఎస్ అధికారుల్లో ఒకరని చెబుతుంటారు. ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ, కొత్త జిల్లాల ఏర్పాటులో ఆయన కీలక పాత్ర పోషించారు. విద్యాశాఖతోపాటు అనేక శాఖల్లో పనిచేసి తనదైన ముద్ర వేసుకున్నారు. అలాగే విజయ్ కుమార్ నెల్లూరు, ఒంగోలు, కృష్ణా జిల్లాలకు కలెక్టర్‌గా గతంలో పనిచేసినప్పుడు తనదైన మార్క్ చూపించారు. విధులకు దూరమయ్యాక కూడా దళిత, గిరిజన, బీసీ, మైనారిటీ వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పెట్టుకున్నారు.

రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఐక్యతా విజయపథంతో పేరుతో విజయ్‌ కుమార్ పాదయాత్ర నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకున్నారు. గతేడాది జులై 23న తిరుపతి జిల్లా తడ నుంచి పాదయాత్ర ప్రారంభించిన విజయ్‌కుమార్‌ కాకినాడ జిల్లా తుని వరకు 2,729 కిలోమీటర్ల మేర నడిచారు. 147 రోజుల్లో 1250 గ్రామాలు, పట్టణాల్లో పర్యటించి లక్షల మందిని కలిసి నిరుపేదల సమస్యలపై అధ్యయనం చేశారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనార్టీ వర్గాల పేదలకు స్వేచ్ఛ కరవైందంటున్న మాజీ ఐఏఎస్.. వారి అభ్యున్నతి కోసం పోరాటానికి సిద్దమయ్యారు.