TRINETHRAM NEWS

టికెట్ వస్తుందా..రాదా …?!

సీఎం క్యాంప్ కార్యాలయానికి వైసిపి ఎమ్మెల్యేల పరుగులు..!

రాష్ట్ర ముఖ్యమంత్రి వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ల పార్టీ ఎమ్మెల్యేలను పరుగులు పెట్టిస్తున్నారు. ప్రతిపక్షాల కంటే ముందుగా 2024 ఎన్నికల్లో తమ పార్టీ ఎమ్మెల్యే టికెట్లను ప్రకటించాలని ప్రయత్నిస్తున్నట్లు తెలియ వచ్చింది.

ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకరి వెనక ఒకరు ఎమ్మెల్యేలంతా తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయానికి పరుగులు పెడుతున్నారు.

వారితో పాటు అసమ్మతి నేతలు కూడా జగన్మోహన్ రెడ్డిని కలిసి తమ అభిప్రాయాలు చెప్పాలని ప్రయత్నిస్తున్నారు. మొత్తానికి సీఎం క్యాంప్ కార్యాలయంలో సందడి నెలకొంది.

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి పలువురు ఎమ్మెల్యేలకు పిలుపు రావడంతో నియోజకవర్గాల్లో ఇన్ చార్జీల మార్పుపై సీఎం జగన్ కసరత్తు కొనసాగుతుంది. సీఎం కార్యాలయానికి వచ్చిన విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్, పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు, ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, మంత్రి, రీజినల్ కో ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు. ఇక, సీటు మార్పు విషయంపై ముఖ్య నేతలు, సీఎంఓ అధికారి ధనుంజయరెడ్డిని ఎమ్మెల్యేలు కలుస్తున్నారు. మరోసారి తమకు అవకాశం ఇవ్వాలని పలువురు ఎమ్మెల్యేలు కోరుతున్నారు. ఎమ్మెల్యేల గ్రాఫ్ వివరించి, సీట్ల మార్పుపై వారితో వైసీపీ ముఖ్య నేతలు చర్చిస్తున్నారు.

దీంతో వైసీపీలో నియోజకవర్గ ఇంఛార్జ్ మార్పుల హడావిడి కొనసాగుతుంది.

నియోజకవర్గ ఇంచార్జ్‌ల మార్పుల సీరియస్ గా కసరత్తు కొనసాగుతుంది. ఇప్పటికే సీఎం క్యాంపు కార్యాలయానికి ఎమ్మెల్యేలు కరణం ధర్మ శ్రీ, గొల్ల బాబూరావు, బియ్యపు మధుసూధన్, కదిరి, పెనుగొండ, రాజాం ఎమ్మెల్యేలు క్యూ కట్టారు. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం ముందు నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి వ్యతిరేక వర్గం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎమ్మెల్యే వద్దు అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

మరోవైపు ప్రకాశం జిల్లా నేతలకు బుజ్జగింపుల పర్వం కొనసాగుతుంది.
జిల్లా నేతలు, పలువురు కొత్త, పాత ఇంఛార్జ్ లతో సైతం విజయసాయిరెడ్డి సమావేశం అయ్యారు. సమన్వయం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇలాంటి గొడవలు మామూలే అంటున్న పార్టీ పెద్దలు తెలిపారు.

ఆ మాత్రం పోటీ, ఆందోళనలు లేకపోతే పార్టీ బలం ఎలా తెలుస్తుంది అని సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.