TRINETHRAM NEWS

హైదరాబాద్‌: ఇసుక అమ్మకాలకు కొత్త విధానం తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడంతో పాటు ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండేలా పాలసీని రూపొందించాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. దీనికోసం ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు. గనులు, భూగర్భ వనరుల శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పుడున్న ఇసుక విధానం అవినీతిమయంగా మారిందన్నారు. దాదాపు 25 శాతం ఇసుక అక్రమంగా తరలివెళ్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ రవాణాను వెంటనే అరికట్టాలని ఆదేశించారు. అన్ని స్థాయుల్లో అధికారులు తమ పద్ధతి మార్చుకోవాలంటూ.. ఇందుకు 48 గంటల డెడ్‌లైన్‌ విధించారు.
‘ఇసుక అక్రమాలపై రెండ్రోజుల తర్వాత విజిలెన్స్‌, ఏసీబీ విభాగాలను రంగంలోకి దింపాలి. అన్ని జిల్లాల్లో వెంటనే తనిఖీలు చేపట్టాలి. బాధ్యులైన ఏ ఒక్కరినీ వదిలిపెట్టొద్దు. అన్ని రూట్లలో టోల్‌గేట్ల వద్ద నమోదైన సమాచారం ఆధారంగా ఇసుక లారీల అక్రమ రవాణా లెక్కలను బయటకు తీయాలి. ఇప్పుడున్న ఇసుక రీచ్‌లు, డంప్‌లను తనిఖీ చేయాలి. తప్పులకు జరిమానాలతో సరిపెట్టొద్దు. కఠిన చర్యలు తీసుకోవాలి’ అని సీఎం ఆదేశించారు. అన్ని ఇసుక రీచ్‌ల వద్ద సీసీ కెమెరాలున్నాయని అధికారులు చెప్పగా.. ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఏడాది మార్చి 1న కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో పాదయాత్రకు వెళ్లినప్పుడు మానేరు వాగులో తనుగుల ఇసుక క్వారీని పరిశీలించగా.. అక్కడ సీసీ కెమెరాలు లేవని అన్నారు. ‘ఫిబ్రవరి 3న రవాణా విభాగంతో నిజామాబాద్‌, వరంగల్‌ రూట్లలో ఆకస్మిక తనిఖీలు చేయించా. 83 ఇసుక లారీలను తనిఖీ చేస్తే.. 22 లారీలకు అనుమతి లేదని తేలింది. ఒకే పర్మిట్‌, ఒకటే నంబరుతో నాలుగైదు లారీలు రవాణా చేస్తున్నట్లు బయటపడింది. ఈ లెక్కన 25 శాతం అక్రమంగా ఇసుక తరలిపోతోంది’ అని చెప్పారు. గనులు, భూగర్భ వనరుల శాఖను సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.