Suicide Attack : పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ లో ఆత్మాహుతి దాడి

TRINETHRAM NEWS

ఇస్లామాబాద్ జ్యుడీషియల్ కాంప్లెక్స్ వద్ద భారీ పేలుడు

ఈ ఘటనలో 12 మంది మృతి, 20 మందికి పైగా గాయాలు

మృతుల్లో అత్యధికులు న్యాయవాదులేనని గుర్తింపు

గ్యాస్ సిలిండర్ పేలుడా, ఆత్మాహుతి దాడా అనే కోణంలో దర్యాప్తు

దక్షిణ వజీరిస్థాన్‌లో కేడెట్ కాలేజీపై టీటీపీ దాడి విఫలం

ఈ దాడితో తమకు సంబంధం లేదని ప్రకటించిన టీటీపీ

Trinethram News : పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌ భారీ పేలుడుతో దద్దరిల్లింది. మంగళవారం నాడు నగరంలోని జ్యుడీషియల్ కాంప్లెక్స్ సమీపంలో జరిగిన శక్తిమంతమైన పేలుడులో కనీసం 12 మంది ప్రాణాలు కోల్పోగా, 20 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో అత్యధికులు న్యాయవాదులేనని పాక్ మీడియా వర్గాలు వెల్లడించాయి. ఇది ఆత్మాహుతి దాడి అని భావిస్తున్నారు.

స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో కోర్టు గేటు వద్ద పార్క్ చేసి ఉన్న ఓ కారులో ఈ పేలుడు సంభవించింది. ఇది అత్యంత రద్దీగా ఉండే సమయం కావడంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగింది. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, కారులోని గ్యాస్ సిలిండర్ పేలడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని భావిస్తున్నా, ఇది ఆత్మాహుతి దాడి అయి ఉండొచ్చని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ పేలుడు తీవ్రతకు చుట్టుపక్కల పార్క్ చేసిన అనేక వాహనాలు ధ్వంసమయ్యాయి. సుమారు 6 కిలోమీటర్ల దూరం వరకు పేలుడు శబ్దం వినిపించినట్లు స్థానికులు తెలిపారు.

“నేను నా కారు పార్క్ చేసి కాంప్లెక్స్‌లోకి వెళుతుండగా, గేటు దగ్గర పెద్ద శబ్దం వినిపించింది. అక్కడ రెండు మృతదేహాలు పడి ఉన్నాయి. అనేక కార్లు మంటల్లో కాలిపోతున్నాయి” అని రుస్తుమ్ మాలిక్ అనే న్యాయవాది ఏఎఫ్‌పీ వార్తా సంస్థకు వివరించారు. ఈ ఆత్మాహుతి దాడిని పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

పెషావర్‌ తరహా దాడికి కుట్ర భగ్నం

ఈ పేలుడుకు కొన్ని గంటల ముందే దక్షిణ వజీరిస్థాన్‌లో పాక్ భద్రతా దళాలు ఓ ఉగ్రకుట్రను భగ్నం చేశాయి. వానాలోని కేడెట్ కాలేజీపై తెహ్రీక్-ఏ-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) ఉగ్రవాదులు చేయబోయిన దాడిని భద్రతా దళాలు అడ్డుకుని, ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చాయి. 2014లో పెషావర్‌లోని ఆర్మీ స్కూల్‌పై జరిగిన తరహా దాడినే పునరావృతం చేయాలని ఉగ్రవాదులు ప్రయత్నించారని పాక్ సైన్యం వెల్లడించింది. ఆనాటి దాడిలో 154 మంది ప్రాణాలు కోల్పోయారు.

గత కొంతకాలంగా పాకిస్థాన్ టీటీపీ ఉగ్రవాదుల నుంచి తీవ్ర ముప్పును ఎదుర్కొంటోంది. ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత పాక్‌లో టీటీపీ కార్యకలాపాలు పెరిగాయి. టీటీపీ నాయకులకు ఆఫ్ఘనిస్థాన్ ఆశ్రయం కల్పిస్తోందని ఇస్లామాబాద్ ఆరోపిస్తుండటంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Suicide attack in Pakistan's capital Islamabad

You cannot copy content of this page

Scroll to Top