PM Modi : వారిని నట్టింట్లోనే ఖతం చేశాం

TRINETHRAM NEWS

Trinethram News : పంజాబ్‌లోని ఆదంపూర్ వైమానిక స్థావరంలో పర్యటించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందర్నీ ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. ఆదంపూర్ ఎయిర్‌బేస్‌లో ఉన్న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సిబ్బందితో కలిసి ముచ్చటించిన ప్రధాని మోదీ..

అక్కడి నుంచే పాకిస్తాన్‌కు గట్టి సందేశం పంపించారు. భారత్‌కు చెందిన అత్యాధునిక ఎయిర్‌ డిఫెన్స్ సిస్టమ్ అయిన ఎస్-400 మిసైల్ సిస్టమ్‌ను ధ్వంసం చేశామని పాకిస్తాన్ అబద్ధాలు చెబుతుండగా.. అదంతా తప్పేనని నిరూపించేందుకు ఎస్-400 మిసైల్ సిస్టమ్ ముందు నిలబడి ప్రధాని ప్రసంగించారు. అంతేకాకుండా భారత్‌లోని ఆదంపూర్ ఎయిర్‌బేస్‌పై దాడి చేసి ధ్వంసం చేశామని చెబుతున్న పాక్‌ను అంతర్జాతీయంగా నవ్వుల పాలు చేసేందుకు.. ప్రధాని మోదీ అక్కడ పర్యటించినట్లు స్పష్టంగా అర్థం అవుతోంది.

ఈ సందర్భంగా ఆదంపూర్ ఎయిర్‌బేస్‌లో పర్యటించిన ప్రధాని మోదీ.. అక్కడి సైనికుల ధైర్యపరాక్రమాలను ప్రపంచానికి చాటి చెబుతూ.. వారికి సెల్యూట్ చేశారు. భారత్‌ మాతాకీ జై అంటూ ప్రసంగం ప్రారంభించిన ప్రధాని మోదీ.. ఆ నినాదం ప్రస్తుతం శత్రువుల చెవుల్లో మారుమోగిపోతోందని తెలిపారు. ఆ నినాదమే ఇప్పుడు శత్రువుల వెన్నులో వణుకు పుట్టించిందని పేర్కొన్నారు.

మన అక్కాచెల్లెళ్లు, బిడ్డల నుదుటిపై ఉన్న సిందూరం తుడిచినవారిని వారి ఇంట్లోకి వెళ్లి నాశనం చేశామని ప్రధాని మోదీ తేల్చి చెప్పారు. ఉగ్రవాదాన్ని పూర్తిగా అంతం చేయాలని భారత సైన్యం శపథం చేసిందని.. పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలను నేలమట్టం చేయడంలో మన సైన్యం చూపిన శక్తిసామర్థ్యాలను ఎంత ప్రశంసించినా తక్కువేనని ప్రధాని మోదీ తేల్చి చెప్పారు.

పాకిస్తాన్ అణ్వాయుధాలు ప్రయోగిస్తామని చేస్తున్న బ్లాక్‌మెయిల్‌ను ప్రధాని మోదీ కొట్టిపారేశారు. భారత సైన్యం శక్తిసామర్థ్యాలు చూసిన తర్వాత తన జీవితం ధన్యమైందని పేర్కొన్నారు. యుద్ధక్షేత్రంలోనూ భారత్‌ మాతాకీ జై నినాదాలు చేశారని.. అది ఆకాశం నుంచి పాతాళం వరకు వినిపించిందని తెలిపారు. ఆదంపూర్ గడ్డపై నుంచి వీర సైనికులు అందరికీ తాను సెల్యూట్ చేస్తున్నానని వెల్లడించారు.

భారత సైనికుల పరాక్రమంతో ఆపరేషన్ సిందూర్ నినాదం ఇప్పుడు అంతర్జాతీయంగా మార్మోగుతోందని ప్రధాని మోదీ వివరించారు. భారత సైన్యానికి దేశంలోని ప్రతీ ఒక్క పౌరుడు మద్దతుగా నిలిచారని.. ఈ సందర్భంగా భారత దళాలకు కృతజ్ఞతలు చెప్తున్నారని వెల్లడించారు. ధర్మసంస్థాపన కోసం ఆయుధం పట్టడం మన సంప్రదాయం, మన విధానమని తేల్చి చెప్పారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

We have killed them

You cannot copy content of this page

Scroll to Top