TRINETHRAM NEWS

పకడ్బందీగా గ్రూప్-1 మెయిన్స్

21 నుంచి 27 వరకు పరీక్షల నిర్వహణ- పొరపాట్లకు తావులేకుండా చర్యలు తీసుకోవాలి

85 శాతం మంది హాల్టికెట్లు డౌన్లోడ్ : కార్యదర్శి- హైదరాబాద్
Trinethram News : Telangana : ఈనెల 21 నుంచి 27వ తేదీ వరకు జరిగే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను ఏ విధమైన పొరపాట్లకు తావు లేకుండా అత్యంత పకడ్బందీగా నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారి స్పష్టం చేశారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, సంబంధిత ఉన్నతాధికారులతో గురువారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం నుంచి చైర్మెన్ మహేందర్రెడ్డి, సభ్యులు పాల్గొనగా, సచివాలయం నుంచి డీజీపీ జితేందర్, కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలస్, ఎస్పీడీసీఎల్ సీఎండీ ముష్రాఫ్ అలీ ఫరూఖీ, రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కర్ణన్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లు అనుదీప్, శశాంక్, గౌతమ్ తదితర అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్బంగా సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు 31,383 మంది అభ్యర్థులు హాజరవుతున్నారని చెప్పారు. దీనికోసం 46 పరీక్షా కేంద్రాలను హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో ఏర్పాటు చేశామని వివరించారు. ఈ పరీక్షలు నిర్వహించే అన్ని కేంద్రాల వద్ద ఏ విధమైన అవకతవకలు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు, విస్తృత స్థాయిలో సీనియర్ అధికారులతో పర్యవేక్షణను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. జిల్లా కలెక్టర్లు నేరుగా ఈ పరీక్షల నిర్వహణను పర్యవేక్షిస్తారనీ, సంబంధిత పోలీస్ కమిషనర్లు కూడా తగు బందోబస్తు ఏర్పాట్లను చేపడతారని వివరించారు. అన్ని శాఖల అధికారులు ఏవిధమైన స్వల్ప సంఘటనలు జరుగకుండా అత్యంత అప్రమత్తంగా ఈ పరీక్షల నిర్వహణ విధులను నిర్వహించాలని ఆమె ఆదేశించారు.
టీజీపీఎస్సీ చైర్మెన్ ఎం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ 2011 సంవత్సరం తర్వాత గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరుగుతున్నాయని చెప్పారు. కొన్నేండ్ల అనంతరం జరిగే ఈ పరీక్షల నిర్వహణలో ప్రతీ అంశంలోనూ అత్యంత జాగ్రత్తగా విధులు నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఆధునిక సాంకేతికత, సోషల్ మీడియా యాక్టివ్గా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణ కూడా సవాల్తో కూడుకుంటున్నదని అన్నారు. ఈ నేపథ్యంలో ఏ విధమైన అపోహలు, పుకార్లకు తావివ్వకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని మహేందర్ రెడ్డి చెప్పారు. గ్రూప్-1 మెయిన్స్ జరిగే అన్ని పరీక్షా కేంద్రాల వద్ద విస్తృతమైన బందోబస్తుతోపాటు పరీక్షలు ప్రశాంతంగా కొనసాగేందుకు అన్ని చర్యలూ చేపట్టామని డీజీపీ జితేందర్ అన్నారు.
టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ మాట్లాడుతూ హైదరాబాద్లో ఎనిమిది, రంగారెడ్డిలో 11, మేడ్చల్ మల్కాజిగిరిలో 27 కలిపి మొత్తం 46 పరీక్షా కేంద్రాల్లో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను నిర్వహిస్తున్నామని వివరించారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద చీఫ్ సూపరింటెండెంట్ రూమ్, పరిసర ప్రాంతాలన్నింటిలోనూ సీసీ టీవీలను ఏర్పాటు చేశామని చెప్పారు. టీజీపీఎస్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా ఈ పరీక్షలను పర్యవేక్షిస్తామని అన్నారు. పరీక్షల నిర్వహణలో ప్రతి అంశంలోనూ కచ్చితమైన నియమ నిబంధనలు పాటించేలా స్పష్టమైన మార్గదర్శకాలను అందజేశామని వివరించారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల బయోమెట్రిక్ హాజరు తీసుకునేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించామని చెప్పారు. మధ్యాహ్నం ఒకటిన్నర తర్వాత పరీక్షా కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే 85 శాతం మంది అభ్యర్థులు గ్రూప్-1 మెయిన్స్ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారని వివరించారు.
వికలాంగులకు ప్రత్యేకంగా ఒక గంటను అదనంగా కేటాయిస్తున్నట్టు చెప్పారు. ఎవరికైతే పరీక్ష రాయడానికి సహాయకులు (స్క్రైబ్ ) అవసరమో, ఆ అభ్యర్థుల హాల్టికెట్లపై ప్రత్యేకంగా పేర్కొన్నామనీ, వారి సహాయంతో పరీక్షలు రాసేందుకు ప్రత్యేకంగా నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. 46 పరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేకంగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేసినట్టు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కర్ణన్ చెప్పారు. పరీక్షలు జరిగే సమయంలో నిరంతరం విద్యుత్ సరఫరా అందించేలా చర్యలు చేపట్టామనీ, ఇందు కోసం ముగ్గురు సీఈలు పర్యవేక్షిస్తారని ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ ఫరూఖీ అన్నారు. పరీక్షలు నిర్వహించే రోజుల్లో అన్ని కేంద్రాలకూ ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసినట్టు ఆర్టీసీ అధికారులు వివరించారు. 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 19న గ్రూప్-1 నోటిఫికేషన్ను టీజీపీఎస్సీ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈనెల 14 నుంచి గ్రూప్-1 మెయిన్స్ హాల్టికెట్ల డౌన్లోడ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈనెల 21 వరకు డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశమున్నది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App