
Golden Opportunity School Dropouts : అరకులోయ, జూలై 23, (త్రినేత్రం న్యూస్): ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 10వ తరగతి, ఇంటర్మీడియట్ కోర్సుల ప్రవేశ ప్రక్రియ ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. ప్రవేశాల బ్రోచర్ను డివిజనల్ పంచాయతీ అధికారి పి.ఎస్. కుమార్, అసిస్టెంట్ కమిషనర్ (పరీక్షల విభాగం) శశికుమార్ సంయుక్తంగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, 14 సంవత్సరాలు పూర్తి చేసిన వారు 10వ తరగతి ప్రవేశాలకు, 15 సంవత్సరాలు పూర్తి చేసిన వారు ఇంటర్మీడియట్ ప్రవేశాలకు అర్హులని తెలిపారు. వివిధ కారణాలతో చదువును మధ్యలో నిలిపివేసిన విద్యార్థులు, ఉద్యోగులు, సాధారణ విద్యను కొనసాగించలేకపోయిన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ విద్యను పూర్తి చేసుకోవాలని సూచించారు.
డివిజనల్ పంచాయతీ అధికారి పి.ఎస్. కుమార్ మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని పంచాయతీ అభివృద్ధి అధికారులు (పిడిఓలు ) ఓపెన్ స్కూల్ ప్రవేశాలపై విస్తృత ప్రచారం చేపట్టాలని ఆదేశించారు. ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామసభలు, స్వయం సహాయక సంఘాలు ఎస్ హెచ్ జి ఎస్ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, గ్రామ సచివాలయాల ద్వారా ప్రవేశాల సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలని సూచించారు.
ముఖ్యంగా చదువు మధ్యలో మానేసిన విద్యార్థులు, విద్యపై ఆసక్తి ఉన్న అభ్యర్థులకు ఓపెన్ స్కూల్ ద్వారా లభించే అవకాశాలపై అవగాహన కల్పించాలని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి అర్హత కలిగిన వ్యక్తికి ఈ సమాచారం చేరేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఓపెన్ స్కూల్ ద్వారా విద్యను కొనసాగించడం వల్ల ఉన్నత విద్యతో పాటు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని అధికారులు పేర్కొన్నారు. చదువును తిరిగి ప్రారంభించాలనుకునే వారికి ఏపీ ఓపెన్ స్కూల్ ఒక మంచి అవకాశమని వారు అభిప్రాయపడ్డారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe